న్యూఢిల్లీ: సిబ్బంది మూకుమ్మడి సెలవులతో టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (Air India Express) విమానాల రద్దు కొనసాగతున్నది. ఆ సంస్థ యాజమాన్య విధానాలను నిరసిస్తూ అనారోగ్య కారణాలతో 200 మందికిపైగా క్యాబిన్ సిబ్బంది (Cabin Crew) ఒకేసారి సెలవు పెట్టడంతో నిన్న 100కి పైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయిన విషయం తెలిసిందే. అయితే మరికొన్ని రోజులు ఇబ్బందులు తప్పవని కంపెనీ సీఈఓ అలోక్ సింగ్ (CEO Aloke Singh) చెప్పారు. షెడ్యూల్ ప్రకారం విధులకు హాజరు కావాల్సిన సిబ్బంది చివరి నిమిషంలో సిక్ లీవ్ పెట్టడంతోనే ఈ సమస్య ఉత్పన్నమైందని తెలిపారు. సుమారు 200 మంది ఉద్యోగులు ఇలా సెలవు పెట్టారని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే భారీగా విమానాలను రద్దుచేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
కాగా, విమానాల రద్దు విషయంలో నష్టనివారణ చర్యలను సంస్థ ప్రారంభించిది. ఇందులో భాగంగా ఎయిర్ఇండియా ఎక్స్ప్రెస్కు చెందిన 25 మంది సిబ్బందిని సంస్థ తొలగించింది. మరికొంతమందికి నోటీసులు జారీచేసింది. మరోవైపు మూకుమ్మడి సెలవులకు గల కారణాలు తెలుసుకోవడానికి సిబ్బందితో చర్చలు జరపాలని యాజమాన్యం నిర్ణయించింది.
బుధవారం 100కు పైగా విమానాలను ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీ, కొచ్చి, కాలికట్, బెంగళూరు సహా పలు ఎయిర్పోర్టుల్లో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఒక్క ఢిల్లీ ఎయిర్పోర్టులోనే బుధవారం ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 14 విమానాలు రద్దయ్యాయి. సిబ్బంది కొరత కారణంగా గల్ఫ్కు గణనీయ సంఖ్యలో విమాన సర్వీసులు నడిపే ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. ఈనెల 13 వరకు విమాన సర్వీసులను తగ్గించుకోవాలని నిర్ణయించింది.
ఎయిరిండియా ఎక్స్ప్రెస్, విస్తారాలను నిర్వహిస్తున్న టాటా గ్రూపులో సంస్థాగతంగా నిర్వహణా లోపాలు, ఉద్యోగులపై అనుసరిస్తున్న వైఖరిపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. ‘మూకుమ్మడి సెలవుల’పై వెళ్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం విస్తారాలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఓవైపు కంపెనీ లాభాల్లో ఉన్నా, తమకు హెచ్ఆర్ఏ వంటి అలవెన్స్లు తొలగించడంపై ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగుల సంఘం ఏప్రిల్లో టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్కు లేఖ రాసింది.
పైలట్లకు కొత్త వేతన విధానాన్ని అన్ని టాటా గ్రూపు విమానయాన సంస్థల్లో అమలు చేయాలని తీసుకొన్న నిర్ణయాన్ని విస్తారాలో పైలట్లు, ఫస్ట్ ఆఫీసర్లు వ్యతిరేకించారు. సంబంధిత కాంట్రాక్ట్పై సంతకం చేయాలని యాజమాన్యం ఉద్యోగులకు అల్టిమేటం ఇవ్వడం ఉద్యోగుల ఆగ్రహానికి కారణమైంది. రోస్టర్ విధానంపై అసంతృప్తి, వీక్లీ ఆఫ్లు కూడా ఉండటం లేదని విస్తారాలో ఉద్యోగులు గత నెల మూకుమ్మడి సెలవులకు వెళ్లారు.