అహ్మదాబాద్: కరోనా టీకా తీసుకునేందుకు నిరాకరించిన ఎయిర్మ్యాన్ను భారత వాయుసేన (ఐఏఎఫ్) సర్వీస్ నుంచి తొలగించింది. అదనపు సొలిసిటర్ జనరల్ దేవాంగ్ వ్యాస్ ఈ మేరకు బుధవారం గుజరాత్ హైకోర్టుకు తెలిపారు. దేశవ్యాప్తంగా ఐఏఎఫ్కు చెందిన 9 మంది సిబ్బంది టీకా వేయించుకునేందుకు నిరాకరించారని, వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయగా ఒకరు స్పందించలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో స్పందించని ఆ ఎయిర్మ్యాన్ను ఉద్యోగం నుంచి ఐఏఎఫ్ తొలగించిందని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఆయన పేర్కొన్నారు.
గుజరాత్లోని జామ్నగర్ ఎయిర్బేస్లో విధులు నిర్వహించే కార్పొరల్ యోగేంద్ర కుమార్, కరోనా టీకా తీసుకునేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఐఏఎఫ్ అతడికి షాకాజ్ నోటీస్ జారీ చేసింది. కరోనా టీకా వేయించుకునేందుకు నిరాకరించిన ఆయనను ఎందుకు సర్వీస్ నుంచి తొలగించకూడదో వివరణ ఇవ్వాలన్నది. ఈ ఏడాది మే 10న ఐఏఎఫ్ జారీ చేసి షాకాజ్ నోటీస్పై యోగేంద్ర కుమార్, గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ షోకాజ్ నోటీసును రద్దు చేయాలని, తనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఐఏఎఫ్ను ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. టీకా తీసుకోవడం అన్నది పూర్తిగా స్వచ్ఛందమని, తప్పనిసరి కాదన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాన్ని ఐఏఎఫ్ పాటించేలా ఆదేశించాలని కోర్టును కోరారు.
మరోవైపు అదనపు సొలిసిటర్ జనరల్ దేవాంగ్ వ్యాస్, ఈ షోకాజ్ నోటీస్పై బుధవారం హైకోర్టుకు వివరణ ఇచ్చారు. సాధారణంగా టీకాకు సంబంధించినంత వరకు అది ఐచ్ఛికమని అన్నారు. అయితే వైమానిక దళానికి సంబంధించినంత వరకు వ్యాక్సినేషన్ అన్నది సేవలకు సంబంధించినదిగా మారిందని, సర్వీస్లో చేరే సమయంలో తీసుకున్న ప్రమాణంలో కొనసాగింపుగా ఉన్నదని చెప్పారు. ఎయిర్ఫోర్స్కు హాని కలిగించే స్థితిలో ఉంచకుండా చూడటం అత్యవసరంమని, ఈ నేపథ్యంలో సిబ్బంది తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాల్సిన అవసరం ఉందని కోర్టుకు వెల్లడించారు.
అయితే, నోటీస్కు స్పందించిన కార్పొరల్ యోగేంద్ర కుమార్, సాయుధ దళాల ట్రిబ్యునల్ చట్టంలోని నిబంధనల ప్రకారం సరైన అధికారి లేదా సాయుధ దళాల ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేయవచ్చని అదనపు సొలిసిటర్ జనరల్ దేవాంగ్ వ్యాస్ చెప్పారు. దీంతో షోకాజ్ నోటీసును రద్దు చేయాలని, తనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఐఏఎఫ్ను ఆదేశించాలని యోగేంద్ర చేసిన అభ్యర్థనలను హైకోర్టు తిరిస్కరించింది. అయితే అతడి కేసును పరిశీలించాలని ఐఏఎఫ్కు హైకోర్టు సూచించింది. కేసును ఐఏఎఫ్ నిర్ణయించే వరకు పిటిషనర్కు ఇచ్చిన తాత్కాలిక ఉపశమనం కొనసాగుతుందని తెలిపింది.