లక్నో: ఉత్తరప్రదేశ్లో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న అభ్యర్థుల నుంచి అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (AIMIM) దరఖాస్తులను ఆహ్వానించడం ప్రారంభించింది. దరఖాస్తు నిర్దేశిత రూపంలో, విశ్వసనీయ ఒప్పందాన్ని కలిగి ఉంటుందంది. ఒకవేళ టికెట్ లభించకపోయినా పార్టీ కోసం నిజాయితీగా పనిచేస్తూ, ఎన్నికల్లో ప్రచారం చేయాల్సి ఉంటుందని పార్టీ పేర్కొన్న ‘లాయల్టీ కాంట్రాక్ట్’ చెబుతోంది.
అభ్యర్థులు దరఖాస్తు ఫారంతో పాటు రూ .10 వేలు దరఖాస్తు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. ఏఐఎంఐఎం స్టేట్ ప్రెసిటెండ్ షౌకత్ అలీ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్లోని 100 ముస్లిం మెజారిటీ స్థానాల్లో పోటీ చేయాలని తాము నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా భావసారుప్యత గల పార్టీలతో పొత్తుకు సంబంధించిన చర్చలు కూడా జరిగినట్లు చెప్పారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ ఎస్పీ, బీఎస్పీ ఇరు పార్టీల తలుపులు తమకోసం తెరిచే ఉన్నాయన్నారు.
టికెట్ల పంపిణీపై పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. దీని కోసం త్వరలోనే రాష్ట్ర పర్యటనకు రానున్నట్లు తెలిపారు. ఇటీవల యూపీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ నియోజకవర్గం అజాంఘర్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య స్వస్థలమైన ప్రయాగ్రాజ్లో ఏఐఎంఐఎం బాగా పనిచేసిందన్నారు.
2017లో పార్టీ 38 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఒక్క సీటు గెలవలేదు. అయినప్పటికీ ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా పార్టీకి 2,05,232 ఓట్లు పోలయ్యాయి. ఇది మొత్తం ఓట్లలో 0.2 శాతం. ఇటీవలి పంచాయతీ ఎన్నికలలో పార్టీ గ్రాఫ్ పెరుగుదల ఎఐఎంఐఎం కార్యకర్తల మనోస్థైర్యాన్ని పెంచిందని షౌకత్ అలీ పేర్కొన్నారు.