AIIMS on Vaccination to Kids | కరోనాను నియంత్రించడానికి పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం అశాస్త్రీయం అని ఎయిమ్స్ సీనియర్ ఎపిడాలమిస్ట్ డాక్టర్ సంజయ్ కే రాయ్ పేర్కొన్నారు. యువజనులు, పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా ఆయన ఉన్నారు. పిల్లలపై వ్యాక్సిన్ల ట్రయల్స్ ఫలితాలు రాకుండా వారికి వ్యాక్సినేషన్ చేపట్టడం వల్ల ఎటువంటి అదనపు ప్రయోజనాలు ఉండబోవని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఇప్పటికే పిల్లలకు కొన్ని దేశాలు ఇస్తున్న వ్యాక్సినేషన్ ఫలితాలను పూర్తిగా విశ్లేషించాల్సి ఉందన్నారు.
జనవరి మూడో తేదీ నుంచి 15-18 ఏండ్ల మధ్య వయస్సు గల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని శనివారం జాతినుద్దేశించి మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. పాఠశాలలు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సినేషన్ వల్ల వారికి, వారి తల్లిదండ్రులకు ఆందోళన తగ్గిస్తుంది. కరోనాకు వ్యతిరేకంగా పోరాడేందుకు దోహద పడుతుంది. పాఠశాలల్లో విద్యాబోధన సాధారణ స్థాయికి తీసుకు రావడానికి ఉపకరిస్తుంది.
దేశ ప్రజలకు నిస్వార్థ సేవ చేస్తూ.. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధాని నరేంద్రమోదీకి నేను గొప్ప అభిమానిని. కానీ పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభించాలని ఆయన తీసుకున్న నిర్ణయం నన్ను పూర్తిగా నిరుత్సాహపరిచింది అని డాక్టర్ సంజయ్ కే రాయ్ ట్వీట్ చేశారు. దీనికి ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)ను ట్యాగ్ చేశారు.