న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో వంద కోట్ల టీకా మార్క్ను అట్టహాసంగా జరిపారు. ఆసుపత్రిలోని ప్రధాన బ్లాకులను పూలతో అందంగా అలంకరించారు. పువ్వుల ముగ్గులతోపాటు 100 కోట్ల వ్యాక్సినేషన్ అని తీర్చిదిద్దారు. ఢిల్లీ ఎయిమ్స్లోని వైద్యులు, సిబ్బంది ఒకరినొకరు అభినందించుకున్నారు. భారత్ 100 కోట్ల కోవిడ్ -19 టీకా మైలురాయి సాధనలో కోవిన్ యాప్ పాత్రను డాక్టర్ ఆర్ఎస్ శర్మ ప్రశంసించారు.
ఈ ఏడాది జనవరి 16న దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభమైంది. నాటి నుంచి గురువారం వరకు వంద కోట్ల వ్యాక్సిన్లు దేశ ప్రజలు పొందారు. ఈ చారిత్రక నేపథ్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా పలు కార్యక్రమాలు చేపట్టింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించింది. అలాగే దేశ వ్యాప్తంగా విమానాశ్రయాలు, విమానాల లోపల, రైల్వే స్టేషన్లు, రైళ్ల లోపల, బస్టాండ్లు, బహిరంగ ప్రదేశాల్లో వంద కోట్ల టీకా సాధన గురించి ఎనౌన్స్మెంట్లు చేశారు.