న్యూఢిల్లీ: విపరీతంగా పెరుగుతున్న కృత్రిమ మేధ(ఏఐ) వినియోగం వల్ల ఈ దశాబ్దం చివరి నాటికి నీళ్ల వినియోగం కూడా విపరీతంగా పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి(ఐరాస) హెచ్చరించింది. 2030 నాటికి ఏఐ సిస్టమ్స్ను నిర్వహించే డాటా కేంద్రాలు 130 కోట్ల మంది ప్రజల ప్రాథమిక గృహ అవసరాలకు సరిపడే నీటిని వినియోగించవచ్చని ఆ సంస్థ నివేదిక అంచనా వేసింది.
ఈ సంఖ్య నేడు మొత్తం ఆఫ్రికా ఖండంలో నివసిస్తున్న ప్రజలకు దాదాపు సమానమని తెలిపింది. ఏఐ సర్వర్లను చల్లపరిచేందుకు, వాటికి అవసరమైన విద్యుత్తు ఉత్పత్తికి భారీగా నీళ్లు అవసరమని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో నీరు, భూమి, విద్యుత్తుపై కలిగే ప్రభావాలను పరిగణనలోనికి తీసుకొని ఆవిష్కరణలపై బాధ్యతాయుతమైన విధానాన్ని అవలంబించాలని ప్రభుత్వాలను, సాంకేతిక సంస్థలను, వినియోగదారులను ఐరాస కోరింది.