చండీగఢ్: గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన గుర్ప్రీత్ సింగ్ సెఖోన్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరారు. ఫిరోజ్పూర్ జిల్లాలోని జిరాలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో సీఎం భగవంత్ మాన్ సింగ్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. (Gurpreet Singh Sekhon Joins AAP) జిరా స్థానం నుంచి గుర్ప్రీత్ సింగ్ సెఖోన్ పోటీ చేయవచ్చని తెలుస్తున్నది. పది రోజుల కిందట ఇక్కడ తన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. త్వరలోనే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే గుర్ ప్రీత్ సింగ్ సెఖోన్ ఆప్లోకి చేరడంపై జిరా సిట్టింగ్ ఎమ్మెల్యే నరేష్ కటారియా వర్గం అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
కాగా, 2016 నవంబర్లో పంజాబ్లోని నాభా జైలు నుంచి తప్పించుకున్నప్పుడు గుర్ప్రీత్ సింగ్ సెఖోన్ తొలిసారి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత మూడు నెలలకు, 2017లో మోగాలో ఆయనను అరెస్ట్ చేశారు. జైలు నుంచి తప్పించుకున్న ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నప్పటికీ, పంజాబ్- హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన విడుదలయ్యారు.
ఆ తర్వాత గుర్ప్రీత్ సింగ్ సెఖోన్, స్థానిక సంస్థల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించారు.
కొన్ని నెలల కిందట పంజాబ్లో జరిగిన జిల్లా పరిషత్, బ్లాక్ సమితి ఎన్నికలలో తన ఇద్దరు బంధువులను స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దింపారు. షిరోమణి అకాలీ దళ్ మద్దతుతో బాజిద్పూర్, ఫెరోజ్షా నియోజకవర్గాల నుంచి వారు విజయం సాధించారు. గతంలో అకాలీ దళ్కు కంచుకోటగా ఉన్న జిరా అసెంబ్లీ స్థానం నుంచి ఆప్ తరుఫున గుర్ప్రీత్ సింగ్ సెఖోన్ పోటీ చేయవచ్చని తెలుస్తున్నది.