న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్ము కశ్మీర్లో ప్రవేశించేందుకు ముందు ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జమ్ము కశ్మీర్ కాంగ్రెస్ ప్రతినిధి దీపిక పుష్కర్ నాధ్ పార్టీకి రాజీనామా చేశారు. భారత్ జోడో యాత్రలో జమ్ము కశ్మీర్ మాజా మంత్రి చౌధరి లాల్ సింగ్కు భాగస్వామ్యం కల్పించడంతో తాను కాంగ్రెస్ నుంచి వైదొలగాలనే నిర్ణయం తీసుకున్నానని ఆమె ట్వీట్ చేశారు.
కథువా లైంగిక దాడి నిందితుడికి లాల్ సింగ్ వెన్నుదన్నుగా నిలిచారని ఆరోపించిన దీపిక తనకు కాంగ్రెస్ నుంచి వైదొలగడం మినహా మరో మార్గం లేదని స్పష్టం చేశారు. సైద్ధాంతిక కారణాలతో అలాంటి వ్యక్తులతో తాను వేదిక పంచుకోలేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రేపిస్టులకు లాల్ సింగ్ మద్దతివ్వడం శోచనీయమని అన్నారు. కథువా లైంగిక దాడి బాధితురాలికి న్యాయం చేసేందుకు మానవహక్కుల కోసం పోరాడే న్యాయవాది దీపిక గట్టిగా నిలబడ్డారు.
ఈ కేసులో బాధితురాలి కుటుంబం తరపున ఆమె వాదనలు వినిపించారు. 2018లో కథువాలో ఎనిమిదేండ్ల బాలిక హత్యాచారం కేసులో నిందితుడి పక్షాన నిలిచాడనే ఆరోపణలపై జమ్ము కశ్మీర్లో బీజేపీ-పీడీపీ ప్రభుత్వంలో అటవీ మంత్రిగా వ్యవహరించిన లాల్సింగ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక రాహుల్ పాదయాత్ర శుక్రవారం జమ్ము కశ్మీర్లో ప్రవేశించనుండగా ఈ యాత్రలో మాజీ సీఎం , ఎన్సీ నేత ఫరూక్ అబ్ధుల్లా, ఒమర్ అబ్ధుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, సీపీఎం నేత మహ్మద్ యూసుఫ్ తరిగామి వంటి అగ్రనేతలు పాల్గొననున్నారు.