Uttar Pradesh | లక్నో : ఓ వ్యక్తి హడావుడిలో తన నివాసముంటున్న ఇంటి గేటు మూయకుండా వెళ్లిపోయాడు. దీంతో అదే భవనంలో ఉంటున్న మరో మహిళ అతనితో గొడవపడి చెవి కొరికేసింది. అనంతరం ఆ చెవి భాగాన్ని ఆమె మింగేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఆగ్రాకు చెందిన రిక్షా పుల్లర్ రామ్వీర్ భగేల్ మార్చి 4వ తేదీన తన కుమారుడిని పరీక్షకు తీసుకెళ్లేందుకు ఉదయం 6 గంటలకు ఇంట్లో నుంచి బయల్దేరాడు. హడావుడిలో ఆ భవనం గేటు మూయడం మరిచిపోయాడు. అదే భవనంలో ఉంటున్న రాఖీ అనే మహిళ రామ్వీర్ ఇంటికి రాగానే అతనితో గొడవపడింది. గేట్ ఎందుకు మూయలేదని ప్రశ్నించింది. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
రాఖీ భర్త సంజీవ్.. రామ్వీర్ను పట్టుకున్నాడు. దీంతో రామ్ వీర్ చెవిని రాఖీ కొరికేసింది. చెవిలోని కొంత భాగం తెగిపోయింది. దాన్ని కూడా ఆమె మింగేసింది. రక్తస్రావంతో బాధపడుతున్న అతన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాధిత వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.