ఆగ్రా: బాల కృష్ణుడి విగ్రహానికి వైద్యులు చికిత్స చేశారు. విరిగిన విగ్రహం చేతికి కట్టుకట్టారు. ఆశ్చర్యపరిచే ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో జరిగింది. అర్జున్ నగర్ ఖేరియా మోడ్లోని పత్వారీ ఆలయంలో లేఖ్ సింగ్ అనే వ్యక్తి 30 ఏండ్లుగా పూజారిగా పనిచేస్తున్నారు. అయితే ఆయన ఎంతగానో ఆరాధించే ‘లడ్డూ గోపాలుడి’ విగ్రహానికి శుక్రవారం స్నాన, పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుండగా జారి పడింది. దీంతో బాల కృష్ణుడి విగ్రహం చేయి విరిగింది.
ఈ ఘటనపై పూజారి లేఖ్ సింగ్ తల్లడిల్లిపోయారు. లడ్డూ గోపాలుడి విగ్రహం, విరిగిన చేతిని తీసుకుని ఏడుస్తూ ఆగ్రా జిల్లా ఆసుపత్రికి పరుగులుతీశారు. తనకు ఎంతో అనుబంధమున్న బాల కృష్ణుడికి చికిత్స చేయాలని అక్కడి వైద్యులను ప్రాధేయపడ్డారు.
తొలుత పూజారి విన్నపాన్ని వైద్య సిబ్బంది పట్టించుకోలేదు. అయితే ఆ పూజారి ఏడ్వడం చూసిన వైద్యులు, జిల్లా చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్ అగర్వాల్కు పరిస్థితిని వివరించారు. ఆయన సూచన మేరకు శ్రీకృష్ణ పేరుతో రిజిస్టర్లో పేషంట్ పేరు నమోదు చేశారు. అనంతరం విరిగిన విగ్రహం చేతికి బ్యాండేజీతో కట్టుకట్టి చికిత్స చేశారు.
కాగా, బాల గోపాలుడి విగ్రహం చేయి విరిగిందన్న బాధతో ఏడుస్తున్న పూజారిని సంతృప్తి పరిచేందుకే ఇలా చేసినట్లు జిల్లా చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్ అగర్వాల్ తెలిపారు. మరోవైపు ఆ పూజారి కృష్ణుడి విగ్రహంతో ఆసుపత్రి వద్ద ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.