వాళ్లందరికీ స్కిల్లింగ్ నేర్పుతాము. స్కిల్లింగ్ నేర్పడం తప్పు కాదు కదా? ఇందులో నేర్పకూడదని రూల్ ఏమన్నా ఉన్నదా? మిలిటరీలో రకరకాలుగా ఉంటాయి. డ్రైవర్లు వేరే ఉంటారు.. ఎలక్ట్రీషియన్లు వేరే ఉంటారు.. బట్టలు ఉతికేవాళ్లు వేరే ఉంటారు.. హెయిర్ కటింగ్ చేసేవాళ్లు ఉంటారు. ఈ రకంగా వేల పోస్టులు ఉంటాయి. కొంతమంది అందులో కూడా ఉపయోగపడుతారు.
–కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
Armed Forces will now be a training ground for skilled labour work force for the nation such as drivers, electricians etc under the Agneepath recruitment scheme. A new achievement unlocked!
Video courtesy: @krishanKTRS pic.twitter.com/WC0hcoWuYQ— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) June 19, 2022
హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ఒక తొందరపాటు నిర్ణయం.. దానిని సమర్థించుకొనేందుకు మరిన్ని అడ్డదిడ్డమైన వాదనలు.. అగ్నిపథ్ పథకంపై కేంద్ర మంత్రులు చిత్రవిచిత్రమైన ప్రకటనలు చేస్తూ అభాసుపాలవుతున్నారు. తలాతోకా లేని ప్రతిపాదనలతో యువతను మరింత రెచ్చగొడుతున్నారు. మన రాష్ర్టానికే చెందిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఒక అడుగు ముందుకేసి ఏకంగా అగ్నివీరులకు బట్టలుతకటం, క్షవరం చేయటం వంటి పనులు నేర్పుతామని.. సైన్యం నుంచి బయటకొచ్చాక వారికి ఆ నైపుణ్యాలు ఉపయోగపడుతాయని చెప్పుకొచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడిన కిషన్రెడ్డి ‘వాళ్లందరికీ (అగ్నివీరులు) స్కిల్లింగ్ (నైపుణ్యాలు) నేర్పుతాము. ఇంట్రెస్ట్ లేనివాళ్లు (సైనికులు) అందులో పనిచేయొచ్చు. స్కిల్లింగ్ నేర్పడం తప్పు కాదు కదా? వేరే ఉండొచ్చు (ఇలాంటి పనులు).. అంతమాత్రాన ఇందులో (సైన్యంలో) నేర్పకూడదని రూల్ ఏమన్నా ఉన్నదా? మిలిటరీలో రకరకాలుగా (ఉద్యోగాలు) ఉంటాయి. డ్రైవర్లు వేరే ఉంటారు.. ఎలక్ట్రీషియన్లు వేరే ఉంటారు.. బట్టలు ఉతికేవాళ్లు వేరే ఉంటారు.. హెయిర్ కటింగ్ చేసేవాళ్లు ఉంటారు. ఈ రకంగా వేల పోస్టులు ఉంటాయి. కొంతమంది అందులో కూడా ఉపయోగపడుతారు’ అని తెలిపారు.
ప్రధాని పకోడీలు.. మంత్రుల హెయిర్ కటింగ్లు
దేశంలో యువతకు ఉపాధి కల్పనపై బీజేపీకి ఎంత నిర్లక్ష్య వైఖరి ఉంటుందనేది ఆ పార్టీ నేతలు అనేక సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలే రుజువు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తానని చెప్పి పీఠమెక్కిన ప్రధానమంత్రే పకోడీలు వేసుకోవటం కూడా ఉద్యోగమేనని వ్యాఖ్యానించారు. ఆయనను ఆదర్శంగా తీసుకొన్న కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు మోదీకంటే రెండాకులు ఎక్కువే చదివినట్టుగా ప్రకటనలు చేస్తున్నారు. అగ్నిపథ్పై యువత నుంచి ఊహించని వ్యతిరేకత ఎదురు కావటంతో కేంద్ర పాలకులకు ఏం చేయాలో పాలుపోవటంలేదు. దీంతో ఒక్కో మంత్రి ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. కిషన్రెడ్డి ఏకంగా సైనికులు బట్టలుతుక్కొని, కటింగ్ చేసుకొని బతకొచ్చని వ్యాఖ్యానించారు. మరో మంత్రి హర్దీప్సింగ్ పురి కూడా అలాగే మాట్లాడారు. ‘అగ్నిపథ్ గొప్ప పథకం. నా శాఖ పరిధిలోని హౌసింగ్, పెట్రోలియం సంస్థల్లో శిక్షణ పొందినవారిని (అగ్నివీరులను) నియమించుకొనేందుకు కసరత్తు మొదలైంది. ప్రభుత్వరంగ సంస్థల్లో వారి నైపుణ్యాలను వాడుకొంటాం’ అని శనివారం వెల్లడించారు. భారత నేవీలో పనిచేసే అగ్నివీరులకు మర్చంట్ నేవీలో (వాణిజ్య నౌకలు) ఉపాధి కల్పిస్తామని షిప్పింగ్ శాఖ, అగ్నివీరులను విమానాల్లో ఎగిరేలా చేస్తామని పౌర విమానయాన శాఖ ప్రకటనలు చేశాయి. నెహ్రూ యువ కేంద్రం సంఘటన్ ఆధ్వర్యంలో అగ్నివీరుల్లో క్రీడాకారులను వెలికితీసేందుకు దేశవ్యాప్తంగా డ్రైవ్ నిర్వహిస్తామని క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించగా, అగ్నివీరుల నైపుణ్యాలు, విదార్హతలను బట్టి వారికి ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉద్యోగాలు ఇస్తామని ఆర్థికశాఖ తెలిపింది.
ఆరు నెలల శిక్షణలో ఏం నైపుణ్యాలు నేర్పుతారు?
కేంద్ర మంత్రుల వ్యాఖ్యలపై యువత మండిపడుతున్నారు. అగ్నిపథ్లో ఉద్యోగాల్లోకి తీసుకొనేదే 20 ఏండ్ల లోపువారిని.. వారికి శిక్షణ ఇచ్చేదే ఆరు నెలలు.. రిటైర్ తర్వాత వారికి ఏం ఉద్యోగాలిస్తారు? అని నిలదీస్తున్నారు. పదో తరగతి విద్యార్హత ఉన్న అగ్నివీరుడికి బ్యాంకులో ఏం ఉద్యోగం ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. భారత సైన్యం సాధారణ నైపుణ్యాలు నేర్పే కోచింగ్ సెంటరా? అని నిలదీస్తున్నారు. అలాంటివి నేర్పడానికి ఇక్కడే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందిగా? అని సోషల్మీడియాలో ఏకిపారేస్తున్నారు. సైనికుడిగా దేశానికి సేవ చేయాలని తపన పడుతున్న యువతను బట్టలుతుక్కొని బతుకు, కటింగ్ చేసుకొని బతుకు, బ్యాంకులో ఆఫీస్ బాయ్ పని చెయ్యి అన్నట్టుగా మాట్లాడుతూ కేంద్ర మంత్రులు అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యలు షాకింగ్గా ఉన్నాయని టీఎస్ఎండీసీ చైర్మన్ క్రిషాంక్ ట్వీట్ చేశారు.
పారా మిలిటరీలో ప్రవేశం ఎలా?
అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెతుతున్న వేళ కేంద్ర హోంశాఖ చేసిన ప్రకటన మరింత గందరగోళానికి తెరతీసింది. అగ్నిపథ్ పథకం ద్వారా సైన్యం చేరి నాలుగేండ్ల తర్వాత రిటైరయ్యే అగ్నివీరులకు పారా మిలిటరీ దళాల్లో చేరేందుకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ ప్రకటనపై మిలిటరీ, పారా మిలిటరీ నిపుణులు భిన్నంగా స్పందిస్తున్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీఐపీ), శషస్త్ర సీమాబల్ (ఎస్ఎస్బీ), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) బలగాలను పారా మిలిటరీ (సీఏపీఎఫ్) అంటారు. వీటి విధులు, శిక్షణ ప్రత్యేకం. సీఏపీఎఫ్, అస్సాం రైఫిల్స్లో కలిపి ప్రస్తుతం 73,219 ఖాళీలు ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లో మరో 18,124 పోలీస్ ఫోర్స్ కొలువులు ఖాళీగా ఉన్నాయి. అగ్నివీరులకు సైన్యంలో 6 నెలలు శిక్షణ ఇస్తారు. ఆ శిక్షణ సైనిక విధులపై ఆధారపడి ఉంటుంది. పారా మిలిటరీలో శిక్షణ అందుకు భిన్నంగా ఉంటుంది. సీఏపీఎఫ్లో శిక్షణ ఎక్కువగా మానసిక దారుఢ్యంపై ఆధారపడి ఉంటుందని ఓ అధికారి తెలిపారు. సీఏపీఎఫ్ దళాలు ముఖ్యంగా సరిహద్దుల్లో పెట్రోలింగ్, మాదక ద్రవ్యాలు, అక్రమ ఆయుధాల రవాణాను అడ్డుకోవటం, శాంతి భద్రతల పరిరక్షణ, వీవీఐపీలకు రక్షణ, విమానాశ్రయాలు, మెట్రోల్లో ప్రయాణికులను చెక్చేయటం వంటి విధులు అధికంగా ఉంటాయి. సైన్యంలో ఇలాంటివేమీ ఉండవు. దీంతో సీఏపీఎఫ్లో చేరే అగ్నివీరులు మళ్లీ సున్నా నుంచి శిక్షణ మొదలు పెట్టాల్సిందేనని సీఐఎస్ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
సైన్యం నుంచి చిన్న దళాల్లోకి?
పారా మిలిటరీతో పోల్చితే సైన్యం అతిపెద్దది, అత్యున్నతమైనది. ఒకసారి సైన్యంలో పనిచేసిన తర్వాత సైనికుడిలో తాను చేస్తున్నది కేవలం ఉద్యోగం కాదన్న భావన బలపడుతుంది. అలాంటి వారిని చిన్నవైన పారా మిలిటరీలో చేరేలా ఒప్పించటం కష్టమని ఓ అధికారి విశ్లేషించారు. కేవలం ఉద్యోగం కోసమే పారా మిలిటరీలో చేరాల్సి రావటంతో చాలామంది సుముఖత చూపకపోవచ్చని తెలిపారు. ఈ అంశంలో ప్రభుత్వం మొదట పైలట్ ప్రాజెక్టును చేపట్టి, తర్వాత పూర్తిస్థాయిలో అమలుచేస్తే బాగుంటుందని పారా మిలిటరీ సీనియర్లు అంటున్నారు.
అగ్నిపథ్తో దేశ భద్రతకు ప్రమాదం
అగ్నిపథ్తో దేశ భద్రతకు ప్రమాద మని ఏపీ రైతుసంఘం అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణయ్య, జమలయ్య ఆందోళన వ్యక్తంచేశారు. నాలుగేండ్లకే రిటైర్మెంట్ ఇవ్వటం దారుణమన్నారు.