న్యూఢిల్లీ, జూన్ 1: అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణి శిక్షణ ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపంలో గురువారం స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (ఎస్ఎఫ్సీ) ఆధ్వర్యంలో మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించినట్టు భారత రక్షణ శాఖ పేర్కొంది. ఈ పరీక్షలో బాలిస్టిక్ క్షిపణి అన్ని రకాల ఆపరేషనల్, టెక్నికల్ పరిమితులను పరీక్షించినట్టు వెల్లడించింది.
లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించే సామర్థ్యం దీనికి ఉందని తెలిపింది. రెండు దశాబ్దాలుగా వివిధ రేంజ్ల బాలిస్టిక్ క్షిపణులను భారత్ అభివృద్ధి చేస్తున్నది. శత్రు దేశాల నుంచి దూసుకొచ్చే బాలిస్టిక్ తరహా క్షిపణులను ఎదుర్కొనేందుకు భారత్ వీటి ప్రయోగాలపై దృష్టి సారిస్తున్నది.