పాట్నా: బీహార్ డిప్యూటీ సీఎం, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav), కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ తర్వాత ‘వన్ నేషన్, వన్ పార్టీ’ అంటారని శనివారం విమర్శించారు. తద్వారా దేశం మొత్తాన్ని నియంత్రించాలని బీజేపీ కోరుకుంటున్నదని దుయ్యబట్టారు. అయితే ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’కు ముందు ‘ఒకే దేశం, ఒకే ఆదాయ విధానాన్ని’ బీజేపీ రూపొందించాలని అన్నారు. ముందుగా ప్రజలకు ఆర్థిక న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా, దేశం మొత్తాన్ని తమ ఆధీనంలోని తీసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని తేజస్వీ యాదవ్ ఆరోపించారు. అందుకే ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ ప్రతిపాదన చేస్తున్నారని అన్నారు. ఆ తర్వాత ‘ఒకే దేశం, ఒకే నేత’ అనడంతోపాటు ‘ఒకే దేశం, ఒకటే పార్టీ’, ‘ఒకే దేశం, ఒకే మతం’ అని కూడా చెబుతారని దుయ్యబట్టారు. వారు (బీజేపీ) ఏ మార్గంలో వెళ్తున్నారు? అని ప్రశ్నించారు. ఇవన్నీ పనికిరాని చర్చలని అన్నారు. దేశ ప్రజలు బలమైన ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని తేజస్వీ యాదవ్ తెలిపారు. ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ దానిని సిద్ధం చేస్తున్నదని అన్నారు.