షిల్లాంగ్: ఒక బాలికపై అత్యాచారానికి ఇద్దరు వ్యక్తులు యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న జనం వారిద్దరిని నిర్బంధించి కొట్టి చంపారు. గుంపు చెర నుంచి వారిని విడిపించేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. (Mob Lynched Two Men) మేఘాలయలోని ఈస్టర్న్ వెస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం నోంగ్తిలీవ్ గ్రామంలోని ఒక ఇంట్లో ఒంటరిగా ఉన్న 17 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఆమెను బెదిరించి లైంగిక దాడికి ప్రయత్నించారు.
కాగా, ఆ బాలిక కేకలు వేయగా స్థానికులు అక్కడకు చేరుకున్నారు. బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పట్టుకుని సమీపంలోని కమ్యూనిటీ హాల్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సుమారు 1500 మంది గుమిగూడారు. వారంతా కలిసి ఆ ఇద్దరు వ్యక్తులను కట్టేసి దారుణంగా కొట్టారు.
మరోవైపు ఈ విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకున్నారు. జనం చెర నుంచి ఆ ఇద్దరు వ్యక్తులను రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే వారిని అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు పోలీసులను జనం అనుమతించలేదు. ఇంతలో ఒక గుంపు ఆ ఇద్దరు వ్యక్తులను మరోసారి చావకొట్టారు.
చివరకు అచేతనంగా పడి ఉన్న వారిద్దరిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. మృతులు ఇద్దరూ ఆ గ్రామంలో కార్మికులుగా పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.