పుణె: కరోనా మహమ్మారి నూతన ఉత్పరివర్తనమైన డెల్టా ప్లస్ వేరియంట్ విస్తరణ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ ప్రకటించింది. లాక్డౌన్ నిబంధనలను సడలించకూడదని అన్ని జిల్లాలకు సూచించింది. ఈ నేపథ్యంలో పుణె మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం సడలించిన ఆంక్షలను మళ్లీ కఠినతరం చేసింది. సోమవారం నుంచి ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి మళ్లీ నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నట్లు తెలిపింది.
అనుమతించిన అన్ని రకాల కార్యకలాపాలను సాయంత్రం 4 గంటలకల్లా మూసివేయాలని, 5 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని పుణె మున్సిపల్ కార్పొరేషన్ స్పష్టంచేసింది. కరోనా పాజిటివ్ కేసులు తగ్గడంతో ఇటీవల పుణె అధికారులు కర్ఫ్యూ వేళలను తగ్గించారు. అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలను సాయంత్రం ఏడు గంటల వరకు అనుమతించారు. రెస్టారెంట్ వేళలను 10 గంటల వరకు పెంచారు.
అయితే, ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్ విస్తరణ నేపథ్యంలో సడలింపులను రద్దు చేస్తున్నట్లు పుణె అధికారులు వెల్లడించారు. రెస్టారెంట్లు, బార్లు, ఫుడ్ కోర్టులు కూడా సోమవారం నుంచి నాలుగు గంటల వరకే కొనసాగుతాయని చెప్పారు. అది కూడా 50 శాతం కెపాసిటీతో మాత్రమే నడుపుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. హోమ్ డెలివరీ, పార్సిల్ సర్వీసులకు రాత్రి 11 గంటల వరకు పర్మిషన్ ఇచ్చినట్లు చెప్పారు.