తిరువనంతపురం: కెనడాలో చదువుతున్న భారతీయ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కుమారుడి మరణం గురించి తెలుసుకున్న డాక్టరైన తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. (Kerala Doctor Ends Life) కేరళలోని అలప్పుజా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కాయంకుళంకు చెందిన 48 ఏళ్ల మెహ్రున్నీస్సా, మావెలిక్కరలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఈఎన్టీ స్పెషలిస్ట్ వైద్యురాలిగా పనిచేస్తున్నది. అయితే కెనడాలో చదువుతున్న పెద్ద కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు ఇటీవల సమాచారం అందింది. నాటి నుంచి తీవ్ర నిరాశ, మనోవేదనతో ఉన్న ఆమె ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త, చిన్న కుమారుడు ఇంట్లో లేని సమయంలో డాక్టర్ మెహ్రున్నీస్సా ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. కెనడాలో చదువుతున్న పెద్ద కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించడాన్ని తట్టుకోలేక ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తున్నదని చెప్పారు.