లక్నో: కరోనా రెండో వేవ్తో పరిస్థితులు విషమిస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో రోజురోజుకు పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. గత 24 గంటల్లో 30 వేల కేసులు నమోదు కావడమే కాదు.. అధిక సంఖ్యలో రోగులు మరణించారు.
కరోనా మహమ్మారి బారిన పడి అయిన వారు మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు దు:ఖంలో మునిగిపోతే.. వారి మృతదేహాలకు అంత్యక్రియల నిర్వహణ తడిసిమోపడవుతున్నది. శ్మశాన వాటికల నిర్వాహకుల డిమాండ్ల మేరకు భారీగా సొమ్ములు సమర్పించుకోవాల్సి వస్తున్నది.
కరోనా సంక్షోభం పేరిట శ్మశాన వాటికల నిర్వాహకులు ఇష్ఠారాజ్యంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో మృతుల కుటుంబ సభ్యుల పరిస్థితి కడు దయనీయంగా మారింది. వారు చెప్పిన ఫీజులు చెల్లించడం తప్ప మృతుల కుటుంబాలకు మరో మార్గం కనిపించడం లేదు.
వారణాసిలోని ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ యజమాని రాజేశ్ సింగ్ (35) కొవిడ్-19తో మరణించిన తన బంధువు అంత్య క్రియల కోసం నగరంలోని హరీశ్ చంద్ర ఘాట్ వద్ద వేచి ఉన్నారు. అంత్యక్రియలకు రూ.11 వేలు ఖర్చవుతుందని ఘాట్ మేనేజర్ చెప్పడమే దీనికి నిదర్శనం.కానీ తాను రూ.5000 మించి చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పాడు రాజేశ్సింగ్. దీంతో మృతదేహంతో ఆ ప్రాంతాన్ని వీడాలని ఘాట్ మేనేజర్ కోరడం గమనార్హం.
ఇదే ఘాట్లో మరో 35 ఏండ్ల యువకుడు తన అత్త అంత్య క్రియలకు రూ.25 వేలు చెల్లించానని చెప్పాడు. తర్వాత బామ్మ అంత్యక్రియలకు రూ.25 వేలు చెల్లించాల్సి వచ్చిందన్నాడు. భారీ మొత్తంలో డబ్బు చెల్లించడం తప్ప మరో మార్గం లేదని ఆ యువకుడు వాపోయాడు.
మృతుల అంత్య క్రియలను పూర్తి చేసేందుకు తాము శ్మశాన వాటికల వద్ద వేచి ఉండాల్సి వస్తున్నదని బాధితులు వాపోయారు. వారణాసిలోని వివిధ శ్మశాన వాటికల వద్ద మేనేజర్లు పూజారులు భారీమొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
శ్మశాన వాటికలో అంత్యక్రియలకు భారీగా చెల్లించినా.. మృతదేహం పూర్తిగా దహనమయ్యేందుకు కలప, ఇతర సామగ్రి సరఫరా చేయడం లేదని బాధితులు తెలిపారు. ఒక్కోసారి మృతదేహాలు పూర్తిగా కాలక ముందే సగం కాలిన కలప దుంగలను కొత్త మృతదేహాలకు వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంతకుముందు ఒక మృతదేహం అంత్యక్రియలకు రూ.3000-4000 ఖర్చయ్యేది.. ఇప్పుడు రూ.12,000-15,000 ఖర్చు చేయాల్సివస్తున్నదని బాధితులు చెబుతున్నారు.వారణాసిలోని మణికర్ణిక ఘాట్ వద్ద కలప సరఫరాదారు మాట్లాడుతూ గత కొన్నిరోజులుగా కలప దుంగల ధర రెట్టింపైందన్నాడు. పలువురు షాప్ యజమానులు పూజా సామగ్రి ధరలు భారీగా పెంచేశారు.
మీరట్లోనూ కరోనాతో మరణించిన వారి మృతదేహాల అంత్య క్రియలు పూర్తి చేయడం అంటే వారి కుటుంబాలకు అదనపు భారంగా పరిణమించింది. సూరజ్కుంద్ శ్మశాన వాటికలో ఇష్టారాజ్యంగా చార్జీలు పెంచేశారు. కలప, పూజ సామగ్రి ధరలు రూ.10 వేలు పలుకుతున్నాయి.
శ్మశానవాటికల కేర్ టేకర్లు రూ.15 నుంచి రూ.20 వేలు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకుముందు రూ.500తో పూర్తయ్యే అంత్యక్రియలకు రూ.5000 వసూలు చేస్తున్నారు.
అంత్యక్రియలు, అటుపై దిన కర్మల నిర్వహణకు హాజరయ్యే పూజారులు తమకు హై రిస్క్ అని, పీపీఈ కిట్లు, ఇతర సామగ్రి సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మీరట్ మున్సిపల్ కమిషనర్ మనీశ్ బన్సాల్ మాత్రం అంత్యక్రియలకు హాజరైన పూజారి రూ.500 వసూలు చేయాలన్నారు.
కొవిడ్-19తో మృతి చెందిన వారికి అంత్యక్రియలపై తమకు ఫిర్యాదులు అందాయని మనీశ్ బన్సాల్ చెప్పారు. దీంతో తమ సిబ్బంది శ్మశాన వాటికలకు వెళ్లి.. నిర్దేశిత ఫీజులు మాత్రమే వసూలు చేయాలని ఆదేశాలిచ్చారన్నారు.
ఇక వేగంగా వ్యాక్సిన్లు.. సీరమ్, భారత్ బయోటెక్లకు 4500 కోట్లు
ఇక పేటీఎం నుంచి ఎల్ఐసీ పాలసీ ప్రీమియం
ఆదాయ, వ్యయాలపై డేగ కన్ను
కరోనా నివారణకు 8 మార్గాలు
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ మరో రికార్డు.. అదేంటంటే!
బంగారం కొనేముందు కన్ఫూజన్ వద్దు!
డ్రాగన్ బ్యాంకులు.. భారత్ ఆంక్షలు.. సిటీ నిష్క్రమణ ఎందుకంటే!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..