ముంబై : భార్య భర్తల మొదలైన చిన్న ఘర్షణ.. విధ్వంసానికి కారణమైంది. వీరిద్దరి లొల్లికి ఇరుగుపొరున పాపానికి పలు కుటుంబాలు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఎదురైంది. భార్యతో గొడవ పడి.. ఆగ్రహంతో భర్త ఇంటికి నిప్పు పెట్టడంతో పొరుగున ఉన్న 10 ఇండ్లకు సైతం మంటలు అంటుకొని కాలిబూడిదయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని సతారా జిల్లా మజ్గావ్ గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంజయ్ పాటిల్ అనే వ్యక్తి తన భార్య పల్లవితో ఏదో ఒక విషయంలో గొడవ జరిగింది.
దీంతో కోపోద్రిక్తుడైన సంజయ్ ఇంటిపై పెట్రోల్ చల్లి నిప్పంటించాడు. దీంతో పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో పక్కనే ఉన్న మరో పది ఇండ్లకు సైతం మంటలు వ్యాపించాయి. మంటలు చల్లార్చేందుకు గ్రామస్తులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనలో రూ.50లక్షలకుపైగా నష్టం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. అయితే, ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని చెప్పారు.
సకాలంలో ఇంట్లో నుంచి అందరూ బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పారు. ఘటన అనంతరం ఇరుగుపొరుగు వారంతా సంజయ్ని పట్టుకొని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. సంజయ్పై భార్య పల్లవి సైతం గృహహింస కింద కేసు నమోదు చేసింది. సంజయ్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుచగా.. రెండు రోజులు పోలీస్ కస్టడీకి పంపారు. ఘర్షణకు గల కారణాలు, ఇండ్లను దహనం చేయడం వెనుక ఉన్న ఉద్దేశాలపై విచారణ జరుగుతుందని పోలీసులు పేర్కొన్నారు.