NC MLA : ఆర్మీ అధికారి చిత్రహింసల వల్ల తాను ఉగ్రవాదిలా మారాలనుకున్నానని నేషనల్ కాన్ఫరెన్స్ (NC) పార్టీ ఎమ్మెల్యే కైసర్ జంషేద్ లోన్ (Qaiser jamshaid lone) చెప్పారు. అయితే ఒక సీనియర్ అధికారి మాటల ద్వారా తనకు వ్యవస్థపై నమ్మకం కలిగిందని అన్నారు. జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కైసర్ జంషేద్ లోన్ సభలో మాట్లాడారు.
చిన్నప్పుడు తాను నివసించే ప్రాంతంలో జరిగిన ఓ ఉగ్రవాదుల దాడి గురించి తనతో సహా 32 మంది యువకులను ఆర్మీ అధికారి ప్రశ్నించారని లోన్ తెలిపారు. టెర్రరిస్టుల్లో చేరిన యువకుడు తెలుసా..? అని ఆ అధికారి తనను అడిగితే తెలుసని తాను చెప్పానని, దాంతో ఆ మిలిటరీ అధికారి తనను కొట్టారని ఆయన చెప్పారు. ‘ఇప్పుడు జరిగిన ఉగ్రదాడిలో ఆ యువకుడు పాల్గొన్నాడా..?’ అని ఆర్మీ అధికారి మరో ప్రశ్న అడిగారని, తాను లేదని చెప్పడంతో మళ్లీ కొట్టారని అన్నారు.
ఇంతలో ఒక సీరియర్ అధికారి అక్కడకు వచ్చి ‘నువ్వు జీవితంలో ఏం కావాలనుకుంటున్నావు..?’ అని అడిగారని, దాంతో నేను మిలిటెంట్గా ఉండాలనుకుంటున్నాను అని చెప్పానని లోన్ చెప్పారు. అందుకు ఆ సీనియర్ అధికారి కారణం అడుగగా.. ఆర్మీ అధికారి చేతిలో తాను అనుభవించిన చిత్రహింసల గురించి చెప్పానని అన్నారు. వెంటనే తనను హింసించిన అధికారిని సీనియర్ అధికారి బహిరంగంగా మందలించారని ఎమ్మెల్యే కైసర్ జంషైద్ లోన్ తెలిపారు.
ఆ సీనియర్ అధికారి చేసిన చర్య వల్లనే వ్యవస్థపై తనకు నమ్మకం కుదిరిందని లోన్ చెప్పారు. సమస్యలను చర్చల ద్వారా ఎలా పరిష్కరించవచ్చో ఈ సంఘటన నిరూపించిందని అన్నారు. అయితే ఆర్మీ వల్ల తనతోపాటు చిత్రహింసలకు గురైన 32 మంది యువకుల్లో 27 మంది ఆ తర్వాత మిలిటెంట్లుగా మారినట్లు తనకు తెలిసిందని లోన్ తెలిపారు.