ముంబై: ప్రేమ వ్యవహారంపై వాగ్వాదం నేపథ్యంలో కుమార్తె గొంతు నొక్కి తల్లి చంపింది. (Woman Murders Daughter) అనారోగ్యంతో చనిపోయినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. వైద్య పరీక్షలో అసలు విషయం తెలియడంతో యువతి తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. బాంద్రాలో నివసిస్తున్న 40 ఏళ్ల టీనా బాగ్డే తన 19 ఏళ్ల కుమార్తె ప్రేమ వ్యవహారంపై ఆమెను నిలదీసింది. ఈ సందర్భంగా తల్లీకుమార్తెల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో తల్లి చేతిని కూతురు కొరికింది. ఆగ్రహించిన తల్లి, కుమార్తె గొంతు నొక్కడంతో ఆమె చనిపోయింది.
కాగా, కుటుంబ సభ్యులు ఆ యువతిని వెంటనే దగ్గరలోని హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఆమెకు ఫిట్స్ వచ్చి మూర్ఛపోయిందని డాక్టర్లకు చెప్పారు. అయితే గొంతు నొక్కి ఆ యువతిని హత్య చేసినట్లు వైద్య పరీక్షలో తేలింది. దీంతో యువతి తల్లి టీనాను పోలీసులు ప్రశ్నించారు. ఆమె నిజం ఒప్పుకోవడంతో అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.