ICMR : సోషల్మీడియా ఖాతాలనే కాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల వెబ్సైట్లను కూడా ఈమధ్య హ్యాకర్లు టార్గెట్ చేస్తున్నారు. నవంబర్లో ఢిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సర్వర్ను హ్యాకర్లు చేజిక్కించుకన్న విషయం తెలిసిందే. చైనాకు చెందిన హ్యాకర్లు రాన్సమ్వేర్ అనే మాల్వేర్ సాయంతో సర్వర్ను హ్యాక్ చేశారు. అయితే.. అదే నెలలో మనదేశంలోని మరో వైద్య సంస్థ సర్వర్ను కూడా హ్యాక్ చేయాలని చూశారట. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెబ్సైట్ సర్వర్ను హ్యాక్ చేయడానికి రోజంతా ప్రయత్నించారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఐసీఎంఆర్ వెబ్సైట్ లక్ష్యంగా హ్యాకర్లు ఒకే రోజు 6 వేల సార్లు ప్రయత్నించారని మంగళవారం జాతీయ సమాచార కేంద్రం అధికారి ఒకరు వెల్లడించారు. మనీకంట్రోల్ న్యూస్ ఈ వార్తను ప్రచురించింది.
హాంకాంగ్కు చెందిన హ్యాకర్లు నవంబర్ 30 తేదీన హ్యాకర్లు 6 వేల సార్లు ఐసీఎంఆర్ వెబ్సైట్ను హ్యాక్ చేయడానికి ప్రయత్నించారు. వాళ్లు బ్లాక్ చేసిన ఐపీ (IP address 103.152.220.133) అడ్రస్తో సర్వస్ను హ్యాక్ చేయాలని చూశారు. అయితే వాళ్ల ప్రయత్నం ఫలించలేదు. వెంటనే సెక్యూరిటీ అధికారులకు విషయం తెలియజేశాం. ఒకవేళ వెబ్సైట్ సర్వర్ హ్యాకర్ల బారిన పడితే విలువైన సమాచారం వాళ్ల చేతుల్లోకి వెళ్లేది. 2020 నుంచి ఐసీఎంఆర్ మీద సైబర్ దాడులు ఎక్కువ అయ్యాయి అని ఆ అధికారి తెలిపారు. అయితే ఈ విషయంపై స్పందించేందుకు ఐసీఎంఆర్ అధికారులు నిరాకరించారు.