వాసాయి: సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాల్కర్ను ఢిల్లీలో అఫ్తాబ్ అమీన్ ముక్కలుగా నరికి చంపిన విషయం తెలిసిందే. ఆ కేసుకు చెందిన వివరాలు మరిన్ని బయటకు వచ్చాయి. ఆఫ్తాబ్ తనను నరికి చంపుతానని బెదిరిస్తున్నట్లు 2020లోనే శ్రద్ధా పోలీసులకు లేఖ రాసింది. మహారాష్ట్రలోని తన స్వంత గ్రామమైన వాసాయిలోని తిలుంజ్ పోలీసులకు ఆ లేఖ రాసిందామె.
ఇద్దరు కలిసి ఉంటున్న ఫ్లాట్లో తనపై అఫ్తాబ్ దాడి చేసినట్లు ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నది. అఫ్తాబ్ కుటుంబానికి అతని ప్రవర్తన గురించి తెలిసినట్లు చెప్పిందామె. అయితే కొన్ని రోజుల తర్వాత తమ మధ్య విబేధాలు లేవని స్థానిక పోలీసులకు ఆ జంట మరో స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలిసింది.
తన సహ ఉద్యోగి కరణ్కు కూడా అఫ్తాబ్ బెదిరింపుల గురించి నవంబర్ 23, 2020 రోజున శ్రద్ధా వాట్సాప్ మెసేజ్ చేసింది. గాయమైన ముఖం ఫోటోలను కూడా ఆమె అతనికి పోస్టు చేసింది. తీవ్రంగా గాయాలు కావడంతో కొన్ని రోజులు హాస్పిటల్లో చికిత్స తీసుకుంది.
గొంతు నొక్కి చంపేందుకు ప్రయత్నించాడని, చంపేస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, ముక్కలుగా నరికేస్తానని బెదిరిస్తున్నాడని, ఆర్నెళ్ల నుంచి అతను కొడుతూనే ఉన్నాడని, కానీ పోలీసుల వద్దకు వెళ్లేందుకు తనకు ధైర్యం రావడం లేదని ఓ లేఖలో శ్రద్ధా పేర్కొన్నది.