న్యూఢిల్లీ: 2024లో లోక్సభ, రాష్ర్టాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలించేలా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ ఈ పిల్ దాఖలు చేశారు. ఎన్నికల ఖర్చును ఆదా చేసేందుకు, భద్రతా బలగాలు, అధికార యంత్రాంగంపై భారాన్ని తగ్గించేందుకు జమిలి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. 2023, 2024 ఏడాదితో గడువు ముగిసే అసెంబ్లీలకు వాటిని గడువును పొడిగించడం/తగ్గించడం ద్వారా 2024 లోక్సభ ఎన్నికలతోపాటే ఎన్నికలు నిర్వహించొచ్చని చెప్పారు. ఈ మేరకు ఆయా రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధిస్తే 2024 లోక్సభ ఎన్నికలతోపాటే 16 రాష్ర్టాల (మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, తెలంగాణ, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ప్రదేశ్, ఒడిశా, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్) అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరుపొచ్చని పేర్కొన్నారు.
ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా రాజకీయ పార్టీల ప్రచార ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. అలాగే ఎన్నికల కోడ్తో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు పదేపదే అంతరాయం కలుగకుండా ఉంటుందని చెప్పారు. జమిలి ఎన్నికలపై చాలా కాలం నుంచి చర్చ నడుస్తున్నదని, లా కమిషన్ కూడా ఏకకాల ఎన్నికలకే మొగ్గు చూపుతుందని గుర్తుచేశారు. అయితే కేంద్రం, ఎన్నికల సంఘం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, సేవా, ఉత్పత్తి రంగ సంస్థల విలువైన సమయం వృథా కాకుండా ఉండేందుకు శని, ఆదివారాలు, సెలవు దినాల్లో ఎన్నికలు జరిపే అంశాన్ని పరిశీలించాలని కూడా తన పిటిషన్లో కోరారు. కాగా, జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రంలోని బీజేపీ సర్కారు మొదటి నుంచీ కోరుతున్నది.