Banke Bihari Temple | ఈ నెల 23న హోలీ పండుగ కోసం దేశం సిద్ధమవుతున్నది. రంగుల పండుగ కోసం ఉత్తరప్రదేశ్ బృందావనంలోని బాంకే బిహారీ ఆలయం సైతం సిద్ధమవుతున్నది. ఆలయంలో హోలీ వేడుకల కోసం ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటారు. ఈ క్రమంలో బాంకే బిహారి ఆలయ నిర్వాహకులు హోలీ నేపథ్యంలో అడ్వైజరీని జారీ చేశారు. ఆలయంలో ఠాకూర్జీ (కృష్ణుడి విగ్రహం)పై గులాల్, రంగులు చల్లడం, మాలలు వేయకూడదని తెలిపారు. కల్తీ రంగులు వాడడం వల్ల సందర్శకుల ఆరోగ్యానికి హాని జరుగుతుందన్నారు.
ఆలయ మేనేజర్ మునీష్ కుమార్ జారీ చేసిన అడ్వైజరీలో.. ఆలయంలో హోలీ రోజున ఎలాంటి గందరగోళన పరిస్థితులు ఉండకూడదన్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన వన్ వే రూట్ చార్జ్ ద్వారా మాత్రమే ఆలయానికి వచ్చి దర్శనం చేసుకొని.. తర్వాత ఆలయం నుంచి వెళ్లిపోవాలన్నారు. వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లలు, ఆరోగ్య సమస్యలు.. అలెర్జీ ఉన్న వ్యక్తులు రద్దీ సమయాల్లో ఆలయానికి రావొద్దని… భక్తులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటేనే ఆలయానికి రావాలని అడ్వైజరీలో తెలిపారు. ఆలయానికి వచ్చే సమయంలో విలువైన వస్తువులు తీసుకురావొద్దని చెప్పారు.