Aditya-L1 | బెంగళూరు, సెప్టెంబర్ 10: సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన మొదటి శాటిలైట్ ఆదిత్య-ఎల్1 లక్ష్యం దిశగా పరుగులు పెడుతున్నది. తాజాగా ఇస్రో ఆదివారం చేపట్టిన మూడో భూ కక్ష్య పెంపు ప్రక్రియ విజయవంతం అయింది. ప్రస్తుతం ఆదిత్య-ఎల్1 శాటిలైట్ 296 x 71,767 కిలో మీటర్ల కక్ష్యలో తిరుగుతున్నది. ఈ మేరకు ఇస్రో ఎక్స్ వేదికగా వెల్లడించింది.
‘బెంగళూరులోని ఇస్రో డీప్ స్పేస్ స్టేషన్ ప్రధాన కేంద్రం నుంచి ఆదివారం చేపట్టిన ఆదిత్య-ఎల్1 మూడో భూ కక్ష్య పెంపు విజయవంతం అయింది. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్- షార్, పోర్ట్బ్లెయిర్లోని ఇస్రో కేంద్రాల నుంచి ఈ ఆపరేషన్ను ట్రాక్ చేశాం. ప్రస్తుతం 296 x 71,767 కిలో మీటర్ల కక్ష్యలో ఆదిత్య-ఎల్1 తిరుగుతున్నది. తదుపరి భూ కక్ష్య పెంపు ప్రక్రియ ఈనెల 15న ఉండనున్నది’ అని ఇస్రో తెలిపింది.