న్యూఢిల్లీ, ఆగస్టు 4: వివిధ రకాల ఇన్ఫ్రా ఆస్తుల్ని కొనుగోలు చేస్తున్న అదానీ గ్రూప్ తాజాగా రెండు రాష్ర్టాల్లో రోడ్డు ప్రాజెక్టుల్ని చేజిక్కించుకుంటున్నది. మెక్వైరీ ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్కు ఆంధ్రప్రదేశ్, గుజరాత్ల్లో ఉన్న టోల్ రోడ్డు పోర్ట్ఫోలియోను రూ. 3,110 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్టు గురువారం అదానీ గ్రూప్ ప్రకటించింది. ఈ ప్రాజెక్టులు పశ్చిమ, దక్షిణ భారత్లో ప్రధానమైన ట్రాఫిక్ కారిడార్లని అదానీ వివరించింది.
అదానీ ఎంటర్ప్రైజెస్ సబ్సిడరీ అయిన అదానీ రోడ్ ట్రాన్స్పోర్ట్ (ఏఆర్టీఎల్) ఈ ప్రాజెక్ట్ల కొనుగోలుకు గుజరాత్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ (మెక్వైరీకి 56.8 శాతం వాటా), స్వర్ణా టోల్వే ప్రైవేట్ లిమిటెడ్ (మెక్వైరీకి నూరు శాతం వాటా)లతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. రెగ్యులేటరీ అనుమతులకు లోబడి 2022 సెప్టెంబర్కల్లా ఈ లావాదేవీ పూర్తవుతుందని అంచనా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు టోల్ రోడ్లు స్వర్ణా టోల్వేకు ఉన్నాయి. చెన్నై, కృష్ణపట్నం రేవుల్ని కలిపే ఎన్హెచ్-16లో తడ నుంచి నెల్లూరు వరకూ 110 కిలోమీటర్ల రోడ్డు ఒకటికాగా, ఎన్హెచ్-65లో నందిగామ-ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ వరకూ 48 కిలోమీటర్ల రోడ్డు మరోటి ఉంది.
గుజరాత్ రాష్ట్రంలో గుజరాత్ రోడ్ అండ్ ఇన్ఫ్రా (జీఆర్ఐసీఎల్)కు రెండు టోల్ ప్రాజెక్టులున్నాయి. ఉత్తర గుజరాత్ కారిడార్లను కలిపే ఎస్హెచ్-41లో అహ్మదాబాద్ నుంచి మెసానా వరకూ 51.6 కిలోమీటర్ల టోల్ ప్రాజెక్ట్ ఒకటికాగా, ఢిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్లోని ఎస్హెచ్-87లో వడొదర నుంచి హలోల్ వరకూ మరో 31.7 కిలోమీటర్ల ప్రాజెక్ట్ ఉంది. జీఆర్ఐసీఎల్లో 56.8 శాతం వాటా మెక్వైరీ వద్దనుండగా, ఐఎల్ఎఫ్ఎస్ వద్ద 26.8 శాతం వాటా, రాష్ట్ర ప్రభుత్వం వద్ద మిగిలిన వాటా ఉంది. మెక్వైరీ లావాదేవీ పూర్తయిన తర్వాత ఐఎల్ఎఫ్ఎస్ వద్దనున్న వాటాను కొనాలన్న యోచనలో అదానీ ఉంది.