తిరువనంతపురం, నవంబర్ 28: అదానీ పోర్టుకు వ్యతిరేకంగా కేరళలో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. ఏకంగా 3000 మంది ఒకేసారి పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. పోలీసులపై దాడికి పాల్పడ్డారు. పోలీస్ వాహనాలు, స్టేషన్లోని సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురం పరిధి విళింజం పోలీస్ స్టేషన్లో ఆదివారం రాత్రి చోటుచేసుకొన్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం నాటి నిరసనల్లో భాగంగా అరెస్టయిన వ్యక్తి సహా నలుగురు అనుమానితులను విడుదల చేయాలని 3 వేల మంది కలిసి పోలీస్ స్టేషన్కు వచ్చి డిమాండ్ చేశారు. పోలీసులు ఒప్పుకోకపోవటంతో వారంతా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 40 మంది గాయపడ్డారు.
ఎఫ్ఐఆర్ ఇదీ..
ఆదివారం సాయంత్రం 6 గంటలకు నిరసనకారులు కర్రలు, ఇటుకలు, ఇనుపరాడ్లతో పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు. శనివారం నాటి కేసులో అరెస్టయిన ఐదుగురిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పోలీస్ స్టేషన్కు నిప్పు పెడతామని హెచ్చరించారు. ఐదు పోలీస్ వాహనాలను, స్టేషన్లోని సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ దాడిలో రూ.85 లక్షల నష్టం వాటిల్లింది.
లాటిన్ క్యాథలిక్ పాస్టర్లపై కేసు
అదానీ పోర్టు వ్యతిరేక నిరసనలకు బాధ్యులను చేస్తూ పోలీసులు మెట్రోపాలిటన్ ఆర్చ్బిషప్ థామస్ జే నెట్టో, పెరెరా సహా 15 మంది లాటిన్ క్యాథలిక్ పాస్టర్లపై కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే శనివారం ఐదుగురిని అదుపులోకి తీసుకొన్నారు. అయితే, ఆ నిరసనలకు తమకు ఎలాంటి సంబంధం లేదని లాటిన్ క్యాథలిక్ చర్చి ప్రకటించింది.
వివాదం ఇదీ..
విళింజం ప్రాంతంలో అదానీ కంపెనీ.. విళింజం అంతర్జాతీయ పోర్టును నిర్మిస్తున్నది. రూ.7,500 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. తమ జీవనోపాధికి గండి పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ 7 డిమాండ్లను పరిష్కరించాలంటున్నారు. ఈ పోర్టు వల్ల మత్య్సకారులకు నష్టం జరుగుతుందని, తీర ప్రాంతం కోతకు గురవుతుందని చెప్తున్నారు. నిర్మాణాన్ని ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాత్కాలిక నిర్వాసితులకు ఆవాసం, భూములు కోల్పోయినవారికి శాశ్వత పునరావాసం కల్పించాలని కోరుతున్నారు. నిరసనలతో పోర్టు నిర్మాణాన్ని ఆపేశారు. ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. అదానీ పోర్టుకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో నిర్మాణాలను పునఃప్రారంభించారు. శనివారం భారీ యంత్రాలను తరలిస్తుండగా స్థానికులు అడ్డుకొన్నారు. వారిని చెదరగొట్టిన పోలీసులు.. కొందరిని కస్టడీలోకి తీసుకొన్నారు.