స్పెక్ట్రమ్ కొనుగోలు రేసులో అదానీ గ్రూపు.. 4 దరఖాస్తుల్లో ఒకటి ఈ సంస్థదే!
న్యూఢిల్లీ, జూలై 8: కేంద్రంలోని మోదీ సర్కార్ అండతో ఇప్పటికే దేశంలో విమానాశ్రయాలు, పోర్టులు, బొగ్గు రంగాలపై ఆధిపత్యం సాధించిన కార్పొరేట్ అదానీ కన్ను ఇప్పుడు టెలికాం రంగంపై పడినట్టు తెలుస్తున్నది. టెలికాం స్పెక్ట్రమ్ కొనుగోలుకు పావులు కదిపినట్టు సమాచారం. ఈ రేసులో రిలయన్స్ జియోకి చెందిన ముఖేష్ అంబానీ, ఎయిర్టెల్ అధినేత భారతి మిట్టల్కు పోటీ ఇవ్వాలనే యోచనలో అదానీ గ్రూపు ఉన్నట్టు తెలిపాయి. ఐదో తరం లేదా అల్ట్రా హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి 5జీ టెలికాం సేవలను అందించగల సామర్థ్యం ఉన్న సంస్థల నుంచి జూలై 26న నిర్వహించే స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించి దరఖాస్తులు శుక్రవారంతో ముగిశాయి.
నాలుగు అప్లికేషన్లు వచ్చినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వీటిలో మూడు ఇప్పటికే టెలికాం రంగంలో ఉన్న జియో, ఎయిర్టెల్, వొడాపోన్-ఐడియావి కాగా, నాలుగోది అదానీ గ్రూప్ అని తెలిపాయి. ఇదే సమయంలో అదానీ గ్రూపు ఇటీవలనే నేషనల్ లాంగ్ డిస్టెన్స్(ఎన్ఎల్డీ), ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్(ఐఎల్డీ) లైసెన్స్లు పొందినట్టు తెలుస్తున్నది. అయితే టెలికాం రంగంలోకి అదానీ గ్రూపు ప్రవేశంపై అధికారికంగా మాత్రం ధ్రువీకరణ లేదు. దీనిపై ఫోన్కాల్స్కు, ఈమెయిళ్లకు సంస్థ నుంచి ఎటువంటి స్పందన రాలేదని పీటీఐ వార్తా సంస్థ పేర్కొన్నది. వేలం నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులకు సంబంధించిన వివరాలను ఈనెల 12న వెల్లడిస్తారు. అప్పుడు మాత్రమే బిడ్డర్లపై అధికారంగా స్పష్టత ఉండే అవకాశం ఉన్నది.