Gautam Adani | న్యూఢిల్లీ, నవంబర్ 14: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనుంగు మిత్రుడు గౌతమ్ అదానీకి కేంద్ర ప్రభుత్వం ఎంతగా సాగిలపడిందనేదానికి మరో రుజువు బయటకొచ్చింది. అదానీ గ్రూప్లోని అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్)కు ప్రధాన సలహాదారుగా ఉన్న వ్యక్తిని కేంద్ర పర్యావరణ శాఖ హైడ్రో ఎలక్ట్రిసిటీ, రివర్ వ్యాలీ ప్రాజెక్టులపై ఏర్పాటుచేసిన ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీలోకి తీసుకొన్నారు. అయితే ఏమిటి అంటారా? ఈ కమిటీ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్) విద్యుత్తు ఉత్పత్తి కంపెనీలకు అనుమతులు ఇచ్చింది మరి.
ఏజీఈఎల్ ప్రధాన సలహాదారు అయిన జనార్ధన్ చౌదరిని మోదీ సర్కారు కేంద్ర పర్యావరణ శాఖ పునర్వ్యవస్థీకరించిన నిపుణుల కమిటీలో నాన్ ఇన్స్టిట్యూషనల్ సభ్యుడిగా గత సెప్టెంబర్లో నియమించింది. అక్టోబర్లో ఈ కమిటీ ముందుకు ఏజీఈఎల్ మహారాష్ట్రలో నిర్మించ తలపెట్టిన 1,500 మెగావాట్ల తరలి పంపింగ్ స్టోరేజీ ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల కోసం వచ్చింది. అక్టోబర్ 17,18 తేదీలో ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను కమిటీ పరిశీలించింది. ఆ సమయంలో కమిటీలో జనార్ధన్ సభ్యుడిగానే ఉన్నారు. ఈ కమిటీ అదానీ గ్రూప్నకు చెందిన మొత్తం 10,300 మెగావాట్ల సామర్థ్యంగల ప్లాంటుకు పర్యావరణ అనుమతులు ఇచ్చింది.
జనార్ధన్ చౌదరిని నిపుణుల కమిటీలో నియమించటంపై విపక్షాలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నియామకం పరస్పర ప్రయోజనం కూడా కాదని.. అంతకు మించి అని శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం మండిపడింది.
జనార్ధన్ చౌదరి నియామకం వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నట్టు విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ. 5.8 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు గత డిసెంబర్లో అదానీ గ్రూప్ ప్రకటించింది. ఇందులో మెజారిటీ ప్రాజెక్టులు భారత్లోనే చేపట్టనున్నట్టు ప్రకటించిన ఆ గ్రూప్ ఈ మేరకు పెద్దయెత్తున నిధులను సేకరించింది. ఈ క్రమంలోనే ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులను మంజూరు చేయించడానికే పర్యావరణ నిపుణుల కమిటీలో జనార్ధన్ చౌదరి నియామకం జరిగినట్టు పలువురు చెబుతున్నారు.
జనార్ధన్ చౌదరిని నిపుణుల కమిటీలో నియమించటంపై విపక్షాలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ‘పర్యావరణ శాఖ పరిధిలోని ఈఏసీ సభ్యుడిగా అదానీ ఉద్యోగి జనార్ధన్ చౌదరిని అదానీ ప్రధాన్ సేవక్ నియమించారు’ అని కాంగ్రెస్ ఆరోపించింది. ఇది పరస్పర ప్రయోజనం కిందకు వస్తుందని విమర్శించింది. ఈ నియామకం పరస్పర ప్రయోజనం కూడా కాదని.. అంతకు మించి అని శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం మండిపడింది. ‘ఒక్క ఈ మెయిల్ షేర్ చేసిసందుకే ఎన్నికైన పార్లమెంటు సభ్యురాలిని (టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర) ఎథిక్స్ కమిటీ జాతీయ భద్రతకు ముప్పు పేరుతో నేరస్తురాలిగా తేల్చింది. ప్రతిపాదనలు పెండింగ్లో ఉన్న ఒక కంపెనీ ఉద్యోగిని.. ఆ ప్రతిపాదనలకు అనుమతులు ఇచ్చే కమిటీలోకి ఎలా తీసుకొన్నారు? దీనిపై దర్యాప్తు అవసరంలేదు. అతను అక్కడికి ఎలా వచ్చాడని తర్కించాల్సిన అవసరం కూడా లేదు.’ అని శివసేన(యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేదీ ట్వీట్ చేశారు.