హైదరాబాద్: హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్లు దుమారం రేపుతున్నాయి. బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ను టార్గెట్ చేస్తూ కొన్ని రోజుల క్రితం సిద్ధార్థ్ ఓ ట్వీట్ చేశాడు. దాంట్లో అనుచిత రీతిలో ఆ హీరో వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల పంజాబ్ టూర్ సమయంలో ప్రధాని భద్రతా వైఫల్యం బయటపడిన విషయం తెలిసిందే. దానిపై ట్విట్టర్లో రియాక్ట్ అయిన నెహ్వాల్.. ప్రధాని భద్రతకే ముప్పు వాటిల్లితే అప్పుడు ఏ దేశం కూడా క్షేమంగా ఉండదన్న అభిప్రాయాన్ని వినిపించారు. అరాచకవాదులు ప్రధానిని టార్గెట్ చేశారని ఆమె ఆ ట్వీట్లో ఆరోపించారు. ఆ ట్వీట్ను రీట్వీట్ చేసిన హీరో సిద్ధార్ధ.. షట్లర్ సైనా నెహ్వాల్ను తప్పుపట్టారు. అభ్యంతరకర రీతిలో కామెంట్ చేశాడు. ఇండియాను రక్షించేవారు ఉన్నారంటూ.. కాక్ చాంపియన్ ఆఫ్ ద వరల్డ్ అంటూ సైనాపై సెటైర్ కామెంట్ చేశాడు.
అనుచితి వ్యాఖ్యలు చేయడంతో సిద్ధార్థ్పై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఇవాళ మళ్లీ ఆ హీరో మరో ట్వీట్ చేశాడు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, కాక్ అండ్ బుల్ కథలు చెప్పారన్న ఉద్దేశాన్ని హీరో సిద్ధార్ధ తన ట్వీట్లో వ్యక్తం చేశాడు. తన ట్వీట్లను మరో విధంగా అర్ధం చేసుకోవద్దు అన్నాడు. తాను ఎటువంటి దురుద్దేశంతో కామెంట్ చేయలేదన్నాడు. అవహేళనకరీతిలో వ్యవహరించలేదంటూ తన ట్వీట్లో పేర్కొన్నాడు.
అయితే హీరో సిద్ధార్థ్ వ్యవహార శైలిపై జాతీయ మహిళా కమీషన్ సీరియస్ అయ్యింది. మహారాష్ట్ర డీజేపీకి ఇవాళ లేఖ రాసింది. సిద్ధార్థ్ అభ్యంతరకర రీతిలో షట్లర్ సైనాపై కామెంట్ చేశారని, ఆ కేసులో మహారాష్ట్ర డీజీపీ విచారణ చేపట్టాలని మహిళా కమిషన్ చైర్మెన్ రేఖా శర్మ డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో సిద్ధార్థ్ చాలా అనుచిత విధంగా మహిళల పట్ల భాషను వాడినట్లు ఆమె ఆరోపించారు. ట్విట్టర్ ఇండియా గ్రీవియన్స్ ఆఫీసర్కు కూడా రేఖ లేఖ రాశారు. నెహ్వాల్పై అమానకర రీతిలో కామెంట్ చేసిన సిద్ధార్థ్ అకౌంట్ను డిలీట్ చేయాలని ఆమె ట్విట్టర్ ఇండియా రెసిడెంట్ గ్రీవియన్స్ ఆఫీసర్ను కోరారు.