న్యూఢిల్లీ, డిసెంబర్ 14: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకొన్నది. చెల్లితో కలిసి పాఠశాలకు వెళ్తున్న 17 ఏండ్ల బాలికపై యాసిడ్ దాడి జరిగింది. ముఖానికి ముసుగులతో బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నడిరోడ్డుపైనే ఈ దురాగతానికి పాల్పడ్డారు. ఢిల్లీలో ఉత్తమ్నగర్లోని మోహన్ గార్డెన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. సఫ్దార్జంగ్ దవాఖానలో బాలిక చికిత్సపొందుతున్నది. ముఖంతో పాటు కండ్లలో కూడా యాసిడ్ పడిందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని, పరిస్థితి స్థిరంగా ఉన్నదని వైద్యులు పేర్కొన్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పోలీసులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలను సహించేది లేదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాల్సిందేనని పేర్కొన్నారు.