ముంబై, ఆగస్టు 14: భారత స్టాక్ మార్కెట్ మాంత్రికుడిగా, ‘వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా’గా ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్ఝున్వాలా (62) గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో సహా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు వెంటనే ముంబైలోని బ్రీచ్ క్యాండీ దవాఖానకు తరలించినా లాభం లేకపోయింది. ఆయన అప్పటికే మరణించారని వైద్యులు ప్రకటించారు. రాకేశ్ ఝున్ఝున్వాలాకు భార్య, ముగ్గురు సంతానం. అంత్యక్రియలు ముంబైలో ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఝున్ఝున్వాలా మృతి పట్ల ప్రధాని మోదీతో పాటు పలువురు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రాకేశ్ మృతి దేశానికి తీరని లోటు అని మోదీ అన్నారు.
మార్కెట్ గురుగా ప్రసిద్ధి
వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన రాకేశ్ ఝున్ఝున్వాలా స్టాక్ ‘మార్కెట్ గురు’గా పేరుగాంచారు. అనేక కంపెనీల్లో ఆయన పెట్టుబడులు పెట్టారు. స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు ఆయన మార్కెట్ విశ్లేషణల కోసం ఆసక్తిగా ఎదురుచూసేవారు. స్వయంగా పెట్టుబడిదారుడైన రాకేశ్.. దాదాపు 30 సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. ఆప్టెక్ లిమిటెడ్, హంగామా డిజిటల్ మీడియా ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు చైర్మన్గా ఉన్నారు. అనేక భారతీయ సంస్థల్లో డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఇటీవలే వైమానిక రంగంలోకి ప్రవేశించి ఆకాశా ఎయిర్ పేరుతో సొంత ఎయిర్లైన్స్ను ప్రారంభించారు. ఈ నెల 7వ తేదీనే ఆ సంస్థ నుంచి తొలి విమానం గాల్లోకి ఎగిరింది. ఝున్ఝున్వాలా చివరగా ఆకాశా ఎయిర్ ప్రారంభోత్సవం సందర్భంగా బయటకు కనిపించారు.
రూ.5 వేలతో మొదలుపెట్టి..
రాకేశ్ ఝున్ఝున్వాలా 1960 జూలై 5న రాజస్థానీ కుటుంబంలో పుట్టారు. చిన్నప్పటి నుంచీ ఆయన ముంబైలోనే పెరిగారు. ఆయన తండ్రి ఆదాయ పన్ను శాఖలో కమిషనర్గా పనిచేశారు. స్టాక్మార్కెట్పై ఆసక్తి పెంచుకోవడానికి ఇది దోహదం చేసింది. 25 ఏండ్ల వయసులో కాలేజీలో చదుకుంటున్న సమయంలో రాకేశ్ తొలిసారి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టారు. రూ.5 వేలతో ప్రయాణం మొదలుపెట్టిన ఆయన.. ప్రస్తుతం దాదాపు రూ.46,000 కోట్ల సంపదన సృష్టించారు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం 2021లో ఆయన మన దేశంలోని అత్యంత సంపన్నుల్లో 30వ స్థానంలో ఉన్నారు. ముంబై స్టాక్ ఎక్సేంజీలో ఆయన తొలి పెట్టుబడి పెట్టినప్పుడు సెన్సెక్స్ కేవలం 150 పాయింట్లు. పెట్టుబడులు పెట్టడంలో రిస్క్ తీసుకొనేందుకు రాకేశ్ ఝున్ఝున్వాలా ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు. అందుకే ఆయనను దలాల్ స్ట్రీట్ బిగ్బుల్, ఇండియన్ వారెన్ బఫెట్ అని పిలుస్తారు.
మొదటి ఏడాదిలోనే భారీ లాభం
రాకేశ్ ఝున్ఝున్వాలా మార్కెట్లోకి ప్రవేశించిన ఏడాదిలో పెద్ద లాభాన్ని రుచి చూశారు. ‘టాటా టీ’లో షేర్ల కొనుగోలుతో పెట్టుబడి ద్వారా రూ.5 లక్షల లాభం పొందారు. రూ.43 చొప్పున షేర్లు కొనుగోలు చేసి వాటిని మూడు నెలల తర్వాత రూ.143 లెక్కన ఆమ్మారు. అలా ఆయన 1986లో మూడింతల రాబడితో రూ.5 లక్షల లాభాన్ని ఆర్జించారు. రాకేశ్కు బాగా కలిసోచ్చిన స్టాక్గా టైటాన్ను చెబుతుంటారు. 2017లో టైటాన్ షేర్ ధర భారీగా పెరుగడంతో ఒక్కరోజులోనే రూ.875 కోట్లు సంపాదించారు.
తప్పుల నుంచి నేర్చుకోవాలి..
రాకేశ్ ఝున్ఝున్వాలా పాటించిన మదుపు సూత్రాలు అనేక మందికి మార్గదర్శకంగా ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో విజయవంతంగా ముందుకు పోవాలంటే కొన్ని సూత్రాలు పాటించాలని పలు సందర్భాల్లో చెప్పారు. గొప్ప మదుపరిగా ఎదగాలంటే తప్పుల నుంచి నేర్చుకోవాలని సూచించారు. విజయానికి షార్ట్కట్లు ఉండవని, సక్సెస్ఫుల్ మదుపరిగా మారాలంటే మార్కెట్పై పూర్తి అవగాహన తెచ్చుకోవాలం టారు. స్థిరమైన మనస్తత్వం ఉండాలని, పోరాట స్ఫూర్తి అలవర్చుకోవాలని, నష్టాలకు కూడా ముందుగానే మానసికంగా సిద్ధమవ్వాలని, అనవసర అంచనాలతో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదని చెప్పేవారు ఝున్ఝున్వాలా.