తిరువనంతపురం: కేరళలో జరిగిన నరబలి ఉదంతానికి సంబంధించిన దిగ్భ్రాంతికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. పత్తనంతిట్ట జిల్లా ఎలందూర్ గ్రామంలో క్షుద్రపూజల్లో భాగంగా ఇద్దరు మహిళలను చంపి వారి శరీరాలన ముక్కలుగా నరికిన సంగతి తెలిసిందే. భగవల్సింగ్, ఆయన భార్య లైలా, రషీద్ అలియాస్ ముహమ్మద్ షఫీ అనే మాంత్రికుడు పోలీసుల అదుపులో ఉన్నారు. మనుషులను బలి ఇచ్చి వారి శరీరభాగాలను వండుకొని తింటే యవ్వనం వస్తుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని షఫీ వారికి చెప్పాడట. మృతుల శరీరభాగాలను ముక్కలు చేసి వండుకొని తిన్నట్టు పోలీసు దర్యాప్తులో లైలా వెల్లడించింది. బాధితులు నెత్తురోడుతుంటే, శవాలను ముక్కలు చేస్తుంటే షఫీ వెర్రి ఆనందానికి లోనయ్యేవాడట. లైలాలో అపరాధ భావన కనిపించలేదని, తమకు యవ్వనం, సంపద చేకూరుతాయని ఇంకా నమ్ముతున్నట్టు పోలీసులు చెప్పారు.