Goa Nightclub Fire | గోవా నైట్క్లబ్ అగ్నిప్రమాదం కేసులో ప్రధాన నిందితులు అయిన గౌరవ్, సౌరభ్ లూత్రా పాస్పోర్టులను రద్దు చేసినట్లు గోవా పోలీసులు తెలిపారు. ఇటీవల జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 25 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ప్రమాదం తర్వాత కొన్ని గంటల ముందు లూత్రా సోదరులు థాయ్లాండ్కు పారిపోయిన విషయం తెలిసిందే. ఇద్దరు మళ్లీ ఎటూ పారిపోకుండా ఉండేందుకు.. ఇంటర్పోల్ సహాయంతో దౌత్య మార్గాల ద్వారా వారిని థాయ్లాండ్ నుంచి బహిష్కరించే అవకాశం కూడా ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. లూత్రా బ్రదర్స్ పాస్పోర్ట్లను రద్దు చేయాలని గోవా ప్రభుత్వం నుంచి విదేశాంగ మంత్రిత్వ శాఖకు అధికారికంగా రిక్వెస్ట్లు వచ్చాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇంటర్పోల్ మంగళవారం ఇద్దరు సోదరులపై బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది. ఇద్దరు సోదరులు ఫుకెట్లో మకాం వేసినట్లుగా భావిస్తున్నారు. అర్పోరాలోని క్లబ్, బిర్చ్ బై రోమియో లేన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన గంట తర్వాత డిసెంబర్ 7న తెల్లవారు జామున 1.17 గంటలకు ఇద్దరు సోదరులు థాయ్లాండ్కు టికెట్లు బుక్ చేసుకున్నారని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. ఆ సమయంలో పోలీసులు, ఇతర అత్యవసర బృందాలను మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. అయితే, కోర్టులో లూత్రా సోదరులు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకున్నారని, వృత్తిపరమైన పనుల కోసం థాయ్లాండ్కు వెళ్లినట్లుగా న్యాయవాది ఢిల్లీలోని రోహిణి కోర్టుకు తెలిపారు.
తక్షణ అరెస్టు నుంచి చట్టపరమైన రక్షణ కోరుతున్నారని తెలిపారు. అయితే, బుధవారం కోర్టు వారికి మధ్యంతర ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది. ముందస్తు బెయిల్పై విచారణను గురువారానికి వాయిదా వేసింది. ప్రమాదం జరిగిన కొద్దిగంటల తర్వాత ఇద్దరు సోదరలు చనిపోయారని.. ఎలాంటి రక్షణ కల్పించొద్దని గోవా పోలీసులు బెయిల్ను వ్యతిరేకించారు. సోదరులు ఇద్దరు భారత్కు వచ్చిన వెంటనే అరెస్టు చేస్తారని భయపడుతున్నారని న్యాయవాది తన్వీర్ అహ్మద్ మీర్ కోర్టుకు తెలిపారు. ఇదిలా ఉండగా.. గోవా పోలీసులు బుధవారం అగ్ని ప్రమాదం కేసులో అజయ్ గుప్తాను ఢిల్లీ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. వైద్య పరీక్షల తర్వాత విచారణ కోసం గోవాకు తరలించనున్నారు.