న్యూఢిల్లీ : మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి తీహార్ జైలులో ఉన్న ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ తమను బెదిరించాడని జైలు అధికారులు ఆరోపించారు. తాను ఏ ఒక్కరినీ విడిచిపెట్టనని తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని జైలు సిబ్బందిని సత్యేందర్ జైన్ బెదిరించారని ఫిర్యాదు నమోదైంది. సర్వీసులో ఉన్న వారైనా, రిటైరైన అధికారులైనా ఎవరినీ విడిచిపెట్టేది లేదని సత్యేందర్ జైన్ చిందులు తొక్కారని జైలు సిబ్బంది ఫిర్యాదు చేశారు.
మనీ ల్యాండరింగ్ కేసులో సత్యేందర్ జైన్ను ఈడీ అధికారులు మే 31న అరెస్ట్ చేశారు. మంత్రి తమను దూషిస్తూ తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బెదిరించారని జైళ్ల ఏఐజీ (తీహార్), సూపరింటెండెంట్ ఆఫ్ జైల్ (తీహార్), తీహార్ జైల్ అసిస్టెంట్ జైల్ సూపరింటెండెంట్ జైదేవ్, డిప్యూటీ జైల్ సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్ డైరెక్టర్ జనరల్ (జైళ్ల శాఖ)కు ఫిర్యాదు చేశారు. తాము సత్యేందర్ జైన్కు షోకాజ్ నోటీసు ఇచ్చేందుకు వెళ్లగా లా అధికారి ఇదంతా చేస్తున్నారని తనకు తెలుసని, తాను జైలు నుంచి బయటకు రాగానే ఆయన నుంచి సీసీటీవీ ఫుటేజ్ కోరతానని, ఉద్యోగం ఎలా చేయాలో అతడికి చెబుతానని, రాజకీయ కోణంలో ఇదంతా జరుగుతోందని అన్నారని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు.
తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నిన ప్రభుత్వ ఉద్యోగులందరినీ వారు సర్వీసులో ఉన్నా, రిటైరైనా విడిచిపెట్టనని బెదిరించారని ఫిర్యాదులో ప్రస్తావించారు. కాగా, జైలు లోపల మసాజ్ సహా పలు ప్రత్యేక సదుపాయాలను జైన్కు కల్పించారని పలు వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. జైలులో జైన్ సెల్ నుంచి సీసీటీవీ ఫుటేజ్ను ఈడీ కోర్టుకు సైతం సమర్పించింది. తనకు వీఐపీ ట్రీట్మెంట్ లభించేలా జైన్ జైలు అధికారులపై ఒత్తిడి చేశాడని, అందుకు నిరాకరించిన అధికారులను వేధించాడని ఆరోపణలు వచ్చాయి.