న్యూఢిల్లీ: సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్, ఒక సభ్యుడి తీరుపై మండిపడ్డారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు త్వరలో చెడ్డ రోజులు వస్తాయంటూ శపించారు. సోమవారం రాజ్యసభలో మాదక ద్రవ్యాల బిల్లుపై చర్చ సందర్భంగా జయా బచ్చన్ మాట్లాడారు. ‘మాకు న్యాయం కావాలి. అక్కడి నుంచి న్యాయం ఆశించడం లేదు.. కానీ మీ నుంచి ఆశించగలమా? సభలోని సభ్యులను లేదా బయట కూర్చున్న 12 మంది సభ్యులను మీరు ఎలా కాపాడుతున్నారు? మీరు వారిని ఎలా రక్షిస్తున్నారు?’ అని సభను నడుపుతున్న చైర్మన్ భువనేశ్వర్ కలిత నుద్దేశించి అన్నారు.
కాగా, జయా బచ్చన్ మాదక ద్రవ్యాల బిల్లుపై మాట్లాడటం లేదని చైర్మన్ గుర్తు చేశారు. బిల్లుపై మీకు ఆసక్తి లేదనిపిస్తున్నదని అన్నారు. దీనికి జయా బచ్చన్ స్పందించారు. ‘మాట్లాడేందుకు నా వంతు వచ్చింది. చర్చ కోసం మూడు నుంచి నాలుగు గంటల సమయం ఇచ్చారు’ అని తెలిపారు. చుట్టుపక్కలున్న సభ్యులు పెద్దగా నిరసన వ్యక్తం చేయగా ట్రెజరీ బెంచీల లక్ష్యంగా జయా బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏం జరుగుతోంది? ఇది భయంకరం’ అని మండిపడ్డారు. ‘ఆప్ లోగోన్ కే బురే దిన్ బహుత్ జల్ద్ ఆయేంగే (మీకు చెడ్డ రోజులు త్వరలో వస్తాయి)’ అని వ్యాఖ్యానించారు.
బీజేపీ ఎంపీ రాకేశ్ సిన్హా పాయింట్ ఆఫ్ ఆర్డర్ను లేవనెత్తారు. చైర్ను లక్ష్యంగా చేసుకుని ఆమె ఆరోపణలు చేశారని అన్నారు. దీంతో సభ్యుల మధ్య మాటల వాగ్వాదం మొదలైంది. కాగా, ఆ సభ్యుడు తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారని జయా బచ్చన్ ఆరోపించారు. ఆ సభ్యుడిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేయగా ఆ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తామని చైర్మన్ ప్రకటించారు. ‘మీకు గొడవ చేయాలనే ఉద్దేశం ఉంటే, ఇది ఇల్లు కాదు. ఐ యామ్ వెరీ సారి. నేను తదుపరి స్పీకర్ని పిలుస్తున్నాను’ అని భువనేశ్వర్ కలిత అన్నారు.
అయితే జయా బచ్చన్ మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సభలోని వారు వ్యక్తిగత వ్యాఖ్యలు ఎలా చేస్తారు? బయట కూర్చున్న సహోద్యోగుల పట్ల మీకు తగిన బుద్ధి లేదా గౌరవం లేకపోవడం చాలా బాధాకరం’ అని అన్నారు. ‘ఆప్ లోగోన్ కే బురే దిన్ బహుత్ జల్ద్ ఆయేంగే, ఇదే నా శాపం’ అని ఆమె మండిపడ్డారు. మరోవైపు పరిస్థితి దాదాపు అదుపు తప్పడంతో సభను సాయంత్రం 5 గంటలకు చైర్మన్ వాయిదా వేశారు.