Goa | గోవా ఎన్నికల్లో ఉత్పల్ పర్రీకర్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఈ వ్యవహారాన్ని ఇతర పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకోవాలని, ఉత్పల్ను తమవైపు తిప్పుకోవాలని శతధా ప్రయత్నాలు చేస్తూనే వున్నాయి. బీజేపీ అభ్యర్థుల జాబితాలో ఉత్పల్ పేరు ప్రకటించకపోవడంతో ఆప్ అలర్ట్ అయ్యింది. ఆప్లో చేరాలంటూ ఉత్పల్కు ఆహ్వానం పంపింది. ఆప్ ఆహ్వానం పంపిన కాసేపటికే శివసేన కూడా స్పందించడం విడ్డూరం. ఉత్పల్ గనక స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగితే, శివసేన మద్దతిస్తుందని సంజయ్ రౌత్ తేల్చి చెప్పారు. ఈ రెండు పార్టీలూ ఉత్పల్కు ఆఫర్ ఇవ్వడంతో ఆయన క్రేజ్ మరింత పెరిగినట్లైంది.
ఆప్లో చేరాలని ఉత్పల్ పర్రీకర్కు కేజ్రీవాల్ ఆహ్వానం పంపారు. ఆప్ టిక్కెట్పై పోటీ చేయాలని కూడా ఆఫర్ ఇచ్చేశారు. మనోహర్ పర్రీకర్ అంటే తనకు వల్లమాలిన అభిమానమని, బీజేపీ యూజ్ అండ్ త్రో పాలసీని అవలంబిస్తోందంటూ కేజ్రీవాల్ విమర్శలు చేశారు.
ఆప్ ప్రకటించిన కాసేపటికే, శివసేన కూడా యాక్టివ్ అయ్యింది. ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అన్నది ఉత్పల్ వ్యక్తిగత నిర్ణయమని రౌత్ పేర్కొన్నారు. గోవాలో బీజేపీని పటిష్ఠపరచడంలో పర్రీకర్ కుటుంబం పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఉత్పల్ గనక స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగితే, శివసేన తప్పకుండా మద్దతిస్తుందని సంజయ్ రౌత్ ప్రకటించారు.
తనకు పనాజీ టిక్కెట్ కావాలని కొన్ని రోజులుగా పర్రీకర్ బీజేపీ అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్న సంగతి విదితమే. అయితే గోవా వ్యవహారాల ఇన్చార్జీ ఫడ్నవీస్ ఈ విషయంలో ఘాటుగా వ్యాఖ్యానించి, ఈ వ్యవహారానికి మరింత ఆజ్యం పోశారు. ఓ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు అయినంత మాత్రాన టిక్కెట్ ఇవ్వాలని ఎక్కడా లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. తాజాగా… గోవా ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అందులో ఉత్పల్ పేరు లేదు. అయితే తాము ఉత్పల్కు రెండు ఆప్షన్లు ఇచ్చామని, మొదటి ఆప్షన్ను ఆయన తిరస్కరించారని, రెండో ఆప్షన్ కైనా ఆయన అంగీకరిస్తారన్న నమ్మకం తమకుందని ఫడ్నవీస్ ఆశాభావం వ్యక్తం చేశారు.