న్యూఢిల్లీ, ఆగస్టు 3: దేశ రాజధాని ఢిల్లీలో అధికారుల నియామకాలు, బదిలీలపై నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ రాజధాని ప్రాంత (సవరణ) బిల్లు-2023కు లోక్సభ ఆమోదం తెలిపింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేస్తూ, సుప్రీంకోర్టు తీర్పునకు తిలోదకాలిస్తూ, ఢిల్లీ ఆర్డినెన్స్ స్థానంలో తీసుకొచ్చిన ఈ బిల్లు లోక్సభ ఆమోదం పొందినట్టు విపక్షాల నిరసనల మధ్యే స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విపక్ష సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. బిల్లు ప్రతులను చింపేశారు. ఆప్ ఎంపీ సుశీల్ కుమార్ రింకు ప్రతులను చింపి స్పీకర్ చైర్ వైపు విసిరారు. దీంతో ఆయన్ను సభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ సహా విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
బిల్లుపై లోక్సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. కేంద్ర పాలిత ప్రాంతాలు, ఢిల్లీలో చట్టాలు రూపొందించే అధికారం కేంద్రానికి ఉందని ఆయన స్పష్టం చేశారు. గతంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఢిల్లీని పాలించినప్పుడు ఈ సమస్య తలెత్తలేదని పేర్కొన్నారు.
ఢిల్లీలో అధికారుల బదిలీలపై కేంద్రం పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ ఆప్ ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే అధికారుల బదిలీలపై హక్కు ఉంటుందని మే 11న తీర్పు వెలువరించింది. దీంతో కేంద్రం ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది.
బిల్లుపై జరిగిన చర్చలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అమిత్ షా ఎన్నికల ప్రసంగం చదివారని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌధురీ విమర్శించారు. ప్రతిపక్షాల నోరు నొక్కి బిల్లును ఆమోదింపజేసుకున్నారని మండిపడ్డారు.
బిల్లును లోక్సభ ఆమోదించడంతో ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ఢిల్లీ ప్రజలను మోదీ వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ‘ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పిస్తామని 2014లో మోదీ హామీ ఇచ్చి విస్మరించారు. ఇకనుంచి ఆయన్ను ఏ విషయంలోనూ నమ్మవద్దు’ అని పేర్కొన్నారు. తొలుత ఆయన కేంద్ర మంత్రి అమిత్ షా లోక్సభలో చేసిన ప్రసంగంపై విమర్శలు గుప్పించారు. ఆర్డినెన్స్ బిల్లుపై అమిత్ షా చేసిన వాదనలో పస లేదని పేర్కొన్నారు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఢిల్లీ ప్రజలను బానిసలుగా మారుస్తుందని. నిస్సహాయులను చేస్తుందని మండిపడ్డారు. కాగా, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ డాటా ప్రొటెక్షన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు.
మణిపూర్ అంశంపై రాజ్యసభ అట్టుడుకుతున్నది. ఈ అంశంపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలంటూ విపక్షాలు చేస్తున్న ఆందోళనను పట్టించుకోకపోవడంతో సభ్యులు వాకౌట్ చేశారు.
ఢిల్లీ ప్రభుత్వ అధికారాల విషయంలో కేంద్రం తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నదని ఎంపీ రంజిత్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీలో అధికారుల నియామకాలు, బదిలీలపై నియంత్రణ కోసం కేంద్రం తెచ్చిన బిల్లుపై లోక్సభలో జరిగిన చర్చలో బీఆర్ఎస్ తరఫున రంజిత్రెడ్డి మాట్లాడారు. ఈ బిల్లును బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని ప్రకటించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బందులు పెడుతున్నదని దుయ్యబట్టారు. ఢిల్లీ అధికారులు ఎవరికి రిపోర్ట్ చేయాలి? వారి బాధ్యతలు, అధికారాలు ఏమిటి? దీనికి ఎవరు జవాబుదారి? అని ప్రశ్నించారు. నాటు నాటు పాటలాగా ఢిల్లీ సీఎం, హోంశాఖ మంత్రిని ప్రధాని మోదీ ఆడిస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ ఆర్డినెన్స్ను తీసుకొచ్చి ఏమి చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని, ఢిల్లీ అధికారులు లెఫ్ట్నెంట్ గవర్నర్కి రిపోర్ట్ చేయాలా? ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలా తేలాల్సి ఉన్నదని చెప్పారు. ఈ బిల్లును వెనకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.