ఢిల్లీలోని జహంగీర్పూరీ అక్రమ నిర్మాల కూల్చివేత ఘట్టంపై ప్రతిపక్షాలు బీజేపీపై తీవ్రంగా మండిపడ్డాయి. భారత రాజ్యాంగ విలువలను కూల్చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా దుయ్యబట్టారు. పేదలు, మైనారిటీలే లక్ష్యంగా ఇలా చేస్తున్నారని రాహుల్ తీవ్రంగా మండిపడ్డారు. ఇక ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా కూడా తీవ్రంగా స్పందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా స్వయంగా ఈ అల్లర్లను ప్రోత్సహిస్తున్నారు. మీరు బుల్డోజర్లను ఉపయోగించాలనుకుంటే.. ఆయన ఇంటిని కూల్చడానికి ఉపయోగించండి. అప్పుడు అల్లర్లు ఆగిపోతాయి అంటూ రాఘవ్ చద్దా తీవ్రంగా మండిపడ్డారు. గత 15 ఏళ్లుగా బీజేపీయే మున్సిపల్ అధికారాన్ని అనుభవించిందని, ఆ సమయంలో అనేక ముడుపులు తీసుకొని, అక్రమ నిర్మాణాలకు అనుమతినిచ్చిందని ఆరోపించారు. ముడుపులు తీసుకున్న బీజేపీ నేతల ఇళ్లను కూడా కూల్చేయాలని రాఘవ్ చద్దా డిమాండ్ చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలోని జహంగిర్పురిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. బుల్డోజర్లతో రోడ్డుపై ఉన్న షాపులను ధ్వంసం చేస్తున్నారు. ఇటీవల హనుమాన్ జయంతి వేడుకల సమయంలో జహంగిర్పుర్లో గొడవలు జరిగిన విషయం తెలిసిందే. ఇవాళ నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్.. జహంగిర్పురిలో యాంటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్ చేపట్టింది. అయితే అక్రమ నిర్మాణాల కూల్చివేత కోసం సుమారు 400 మంది పోలీసులు బందోబస్తు చేస్తున్నట్లు తెలిసింది. అక్రమ నిర్మాణాల కూల్చివేత సమయంలో జహంగిర్పురిలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఇవాళ తొమ్మిది బుల్డోజర్లు జహంగిర్పురిలో నిర్మాణాలను నేలమట్టం చేశాయి. అయితే అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ఇవాళ సుప్రీంకోర్ట్ స్టే ఇచ్చింది. నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తక్షణమే కూల్చివేతలను ఆపాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. సుప్రీం ఆదేశాలతో అక్రమ నిర్మాణాల కూల్చివేతను ఆపేసినట్లు నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ తెలిపారు.