MLA Marriage: పంజాబ్లో అధికార ఆమ్ఆద్మీ పార్టీకి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే వివాహం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఆమె తమ పార్టీకే చెందిన ఓ సాధారణ కార్యకర్తను వివాహం చేసుకున్నారు. నరీందర్ కౌర్ భరాజ్ (28) పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సంగ్రూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమ్ఆద్మీ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. పంజాబ్ అసెంబ్లీలో అతిపిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా గుర్తింపు దక్కించుకున్నారు.
ఆ ఎమ్మెల్యే వివాహం శుక్రవారం అత్యంత సాదాసీదాగా జరిగింది. ఆప్ కార్యకర్త మన్దీప్సింగ్ను ఆమె వివాహం చేసుకున్నారు. పటియాలాలోని బవా పూరన్ దాస్ డేరాలో వారిద్దరూ ఒక్కటయ్యారు. నరీందర్ కౌర్, మన్దీప్ సింగ్ ఇద్దరూ 2014 నుంచి ఆమ్ఆద్మీ పార్టీలో పనిచేస్తున్నారు. మొదట్లో మన్దీప్ ఆప్ తరఫున సంగ్రూర్ జిల్లా మీడియా ఇన్చార్జిగా కూడా పనిచేశారు. అప్పటి నుంచి వారి మధ్య పరిచయం ఉంది.
ఈ క్రమంలో సంగ్రూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నరీందర్ కౌర్ మన్దీప్ను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఆ మేరకు శుక్రవారం కేవలం ముఖ్యమైన బంధువుల మధ్య నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. పెండ్లిళ్లు వంటి కార్యాలకు అతిగా వ్యయం అనవసరమనే మెసేజ్ ఇవ్వడానికే తాము ఈ విధంగా వివాహం చేసుకున్నామని నరీందర్ కౌర్ చెప్పారు.