Gurpreet Singh : పంజాబ్లో ఒక ఆప్ నేత దారుణ హత్యకు గురయ్యాడు. గుర్ప్రీత్ సింగ్ అలియాస్ గోపి అనే ఆమ్ ఆద్మీ పార్టీ నేతను నలుగురు దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన పంజాబ్, ఫిరోజ్పూర్ జిల్లా, మామ్దోత్ పరిధిలో శనివారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆప్ నేతలు గుర్ప్రీత్ సింగ్ (45), మరో నేత హర్ప్రీత్ అలియాస్ హ్యాపీ (22) ఇద్దరూ బైకుపై వెళ్తున్నారు.
ఇటీవల మామ్దోత్ పంచాయతి ఆప్ అధ్యక్షుడిగా నియమితుడైన విక్కీ మౌని వారి వెనుక కారులో వస్తున్నారు. వీరంతా స్థానిక మెయిన్ బజార్ సమీపంలో వెళ్తుండగా ఒక కారులో ఆయుధాలతో వచ్చిన నలుగురు దుండగులు వీరిపై కాల్పులు జరిపారు. ముందుగా బైకుపై వెళ్తున్న గుర్ప్రీత్ సింగ్, హర్ప్రీత్పై కాల్పులు జరిపారు. అలాగే, వెనుక కారులో ఉన్న విక్కీ మైనిపై కూడా కాల్పులు జరిపారు. కానీ, విక్కీ ఆ కాల్పుల నుంచి తప్పించుకున్నాడు. అతడికి ఎలాంటి గాయాలు కాలేదు. కాల్పుల అనంతరం దుండగులు అక్కడ్నుంచి కారులో తప్పించుకుని వెళ్లారు.
ఈ ఘటనలో గుర్ప్రీత్ సింగ్, హర్ప్రీత్.. ఇద్దరికీ గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే గుర్ప్రీత్ సింగ్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. హర్ప్రీత్ పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో అతడిని మెరుగైన చికిత్స కోసం లూథియానా తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
గత మున్సిపల్ ఎన్నికల సమయంలో తలెత్తిన విబేధాలే ఈ కాల్పులకు కారణం అని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ కాల్పులకు పాల్పడిన నిందితుల్ని పోలీసులు గుర్తించారు. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు సీనియర్ ఎస్పీ భూపిందర్ సింగ్ తెలిపారు.