అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని యోచిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కాంగ్రెస్ నేత హార్ధిక్ పటేల్ను తమ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. హార్ధిక్ పటేల్ సమయం వృధా చేయకుండా తమ పార్టీలో చేరాలని గుజరాత్ ఆప్ చీఫ్ గోపాల్ ఇటాలియా రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్ధిక్ పటేల్ను కోరారు. కాంగ్రెస్ పార్టీ తన సేవలను సమర్ధంగా ఉపయోగించుకోకుండా పక్కనపెట్టిందని హార్ధిక్ పటేల్ బుధవారం కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
అయితే తాను కాంగ్రెస్ పార్టీని వీడబోనని ఆయన పేర్కొన్నారు. పార్టీలో సమస్యలు, భేదాభిప్రాయాలు ఉన్నా తామంతా గుజరాత్ బాగు కోసం కలిసికట్టుగా పనిచేస్తామని స్పష్టం చేశారు. హార్ధిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీని ఇష్టపడని పక్షంలో ఆప్ వంటి భావసారూప్యం కలిగిన పార్టీలో చేరాలని పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి వెల్లడిస్తూ కాలయాపన చేయకుండా ఆయన ఆప్లో చేరడం మేలని సూచించారు.
మరోవైపు తాను కాంగ్రెస్ పార్టీని వీడతానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని హార్ధిక్ పటేల్ తోసిపుచ్చారు. కాంగ్రెస్ పార్టీకి తన సేవలు భవిష్యత్లోనూ కొనసాగుతాయని స్పష్టం చేశారు. 2015లో ఓబీసీ కోటా కింద రిజర్వేషన్లు కోరుతూ పటేల్ ఉద్యమానికి నాయకత్వం వహించిన హార్ధిక్ పటేల్ను రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆపై 2020లో గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా హార్ధిక్ పటేల్ బాధ్యతలు చేపట్టారు.