న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం కేంద్రం ఆర్డినెన్స్ (Centre’s ordinance)ను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఢిల్లీలో పరిపాలన నియంత్రణకు సంబంధించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్పై సర్వోన్నత న్యాయస్థానాన్ని శుక్రవారం ఆశ్రయించింది. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా కేంద్రం ఆర్డినెన్స్ ఉందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం ఆరోపించింది. మే19న కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ ఆర్డినెన్స్ ద్వారా ఢిల్లీలో ఐఏఎస్, ఇతర ప్రభుత్వ అధికారుల పోస్టింగులు, బదిలీలను కేంద్రం అడ్డుకుంటున్నదని ఆ పిటిషన్లో విమర్శించింది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా తెచ్చిన ఢిల్లీ ఆర్డినెన్స్ను నిలిపివేయాలని సుప్రీంకోర్టును కోరింది.
కాగా, కేంద్ర ప్రభుత్వం ఢిల్లీపై పెత్తనాన్ని చెలాయిస్తున్నది. కార్యనిర్వాహక విధులను లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా నియంత్రిస్తున్నది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మే 11న కీలక తీర్పు ఇచ్చింది. పోలీస్, పబ్లిక్ ఆర్డర్, భూ వ్యవహారాలు మినహా ఢిల్లీలోని మిగతా అన్ని శాఖలు, విభాగాలు, సేవల నియంత్రణ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే ఉంటుందని స్పష్టం చేసింది.
మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్రం నియంత్రణలో ఉన్న వివాదస్పద ఐఏఎస్ అధికారుల బదిలీకి ఆప్ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే దీనిని అడ్డుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చింది. దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నది.
కాగా, ప్రతిపక్షాల మెజార్టీ ఉన్న రాజ్యసభలో ఈ బిల్లును ఎదుర్కొనేందుకు విపక్ష పార్టీల మద్దతు కూడగట్టేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నించారు. అయితే ఈ అంశంలో ఆప్కు మద్దతిపై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఆప్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.