న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసు దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఆఫ్తాబ్ అమీన్ పూనావాలాకు రేపు నార్కో టెస్టు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. నేరస్థులు లేదా నిందితుల నుంచి వాస్తవాలను రాబట్టడానికి పోరెన్సిక్ నిపుణులు, దర్యాప్తు అధికారులు, వైద్యులు, సైకాలజిస్టుల పర్యవేక్షణలో నార్కో-అనాలిసిస్ పరీక్ష నిర్వహిస్తారు.
పోలీసుల కస్టడీ ముగియడంతో నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలాను మంగళవారం ఉదయం ఢిల్లీ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. క్షణికావేశంలోనే తాను శ్రద్ధావాకర్ను హత్య చేసినట్టు ఆఫ్తాబ్ అంగీకరించాడు. కేసు దర్యాప్తు కోసం పోలీసులకు సహకరిస్తానని చెప్పాడు. అయితే ఆఫ్తాబ్ తప్పుడు ప్రచారం ఇచ్చి తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అతడికి పాలిగ్రాఫ్ పరీక్ష చేపట్టేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. పాలిగ్రాఫ్తో పాటు నార్కో టెస్టు కూడా నిర్వహించనున్నారు.