కార్డు ఉంటుందా? రద్దు అవుతుందా?
బ్యాంకు ఖాతా, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కరోనా వ్యాక్సిన్, చివరకు అద్దె ఇంట్లో దిగాలంటే కూడా ఓనర్ కిరాయిదారు ‘ఆధార్’ను అడుగుతున్నాడంటే ఆ కార్డు భారతీయుల జీవితంలో ఎంతలా మమేకమైందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో ప్రాథమిక గుర్తింపు కార్డుగా చాలామంది దీన్ని వినియోగిస్తున్నారు కూడా. ఇంతటి ప్రాధాన్యం కలిగి ఉన్నది కాబట్టే, పుట్టిన బిడ్డకు జనన ధ్రువీకరణ పత్రం మంజూరుకాకపోయినప్పటికీ, ఆధార్ ఎన్రోల్మెంట్కు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నది. అయితే, మరణించిన తర్వాత ఓ వ్యక్తి ఆధార్ కార్డు ఏమవుతుంది? చనిపోయిన వ్యక్తి ఆధార్ సంఖ్యను ఇంకెవరికైనా కేటాయిస్తారా?
కొత్త నిబంధనలు తేవాల్సిందే!
మరణించిన వ్యక్తి ఆధార్ కార్డును రద్దు చేసే వ్యవస్థ ప్రస్తుతమైతే అందుబాటులో లేదు. ఈ మేరకు కేంద్ర ఐటీ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. చనిపోయిన వ్యక్తి ఆధార్ కార్డును అధికారులకు అప్పగించేలా ప్రత్యేక నిబంధనలు, వ్యవస్థ ఇప్పటివరకైతే లేదన్నారు. అయితే, దీనిపై త్వరలోనే కొత్త నిబంధనలతో కూడిన విధానాన్ని తీసుకువస్తామన్నారు.
ఏమిటీ కొత్త విధానం?
దేశంలో పౌరుల జనన, మరణాల సమాచారాన్ని రిజిస్ట్రార్స్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ విభాగం నిర్వహిస్తున్నది. వ్యక్తి మరణిస్తే, ఆ మరణాన్ని ధ్రువీకరించే సర్టిఫికేట్ కావాలంటే ఈ శాఖకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అయితే, ఇకపై ఎవరైనా పౌరుడు మరణిస్తే ఆ వ్యక్తి మరణ ధ్రువీకరణ పత్రానికి దరఖాస్తు చేసేటప్పుడు సదరు వ్యక్తి కుటుంబసభ్యులు బాధితుడి ఆధార్ ను విధిగా బర్త్స్ అండ్ డెత్స్ శాఖకు అప్పగించాల్సి ఉంటుంది. ఆ వివరాలను ఆధార్ కార్డులను నిర్వహించే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)కు బర్త్స్ అండ్ డెత్స్ శాఖ అధికారులు పంపిస్తారు. అనంతరం మరణించిన వ్యక్తి ఆధార్ను యూఐడీఏఐ రద్దు చేస్తుంది. దీనికోసం రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ యాక్ట్, 1969కి సవరణలు చేయనున్నారు.
మరణించిన వ్యక్తి ఆధార్ నంబర్ను ఇంకొకరికి ఇవ్వొచ్చా?
మరణించిన వ్యక్తి ఆధార్ నంబర్ను మరొకరికి కేటాయించే అవకాశంలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం.. ఆధార్ కార్డును మంజూరు చేసే సమయంలో వ్యక్తుల నుంచి బయోమెట్రిక్ వివరాలను (వేలి ముద్రలు, కంటి స్కానింగ్) తీసుకోవడమేనని చెబుతున్నారు.
ఓటర్ ఐడీ, పాన్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ సంగతేంటి?
మరణించిన అనంతరం అతని వారసులు బాధితుడి ఓటర్ ఐడీని స్థానిక ఎన్నికల కార్యాలయంలో, పాన్ కార్డును స్థానిక ఆదాయ పన్ను శాఖ కార్యాలయంలో అప్పగించాలని నిబంధనలు చెబుతున్నాయి. దీనికి కారణం.. మరణించిన వ్యక్తి ఆస్తిపై వారసులు హక్కును కలిగిఉన్నప్పుడు.. బాధిత వ్యక్తికి సంబంధించిన ధ్రువపత్రాలను ప్రభుత్వ యంత్రాంగానికి అప్పగించే బాధ్యత కూడా వారసులపై ఉంటుందని ఇండస్లా కంపెనీ డైరెక్టర్ అమిత్ జజూ తెలిపారు. అయితే, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్కు పరిమిత కాలవ్యవధి ఉంటుంది కాబట్టి మరణించిన వ్యక్తుల పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు వాటంతట అవే రద్దు అవుతాయని పేర్కొన్నారు.
ఆధార్ విశేషాలు
ఆధార్ ప్రారంభించిన తేదీ: 2009 జనవరి 28
దేశ జనాభా: 139.5 కోట్లు
మంజూరైన ఆధార్ కార్డులు: 128.99 కోట్లు