న్యూఢిల్లీ: ఓటరు నమోదుకు ఆధార్ తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఈ మేరకు గురువారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఓటరుగా నమోదు చేయించుకునేందుకు ఉపయోగించే ఫారం-6, ఫారం-6బీలలోని కాలమ్స్లో ఆధార్ సంఖ్యను అడగడానికి కారణం కేవలం ఆ వ్యక్తి గుర్తింపు వివరాలను ధ్రువీకరించుకోవడం కోసం మాత్రమేనని తెలిపింది.
ఆధార్ సంఖ్య లేకపోతే, ఓటరు ఐడీ కార్డును జారీ చేయడం వీలుకాదని దీని భావం కాదని స్పష్టం చేసింది. ఈ విధానంలో మార్పులు చేసినట్లు, దీనికి సంబంధించిన వివరణను త్వరలోనే జారీ చేయనున్నట్లు తెలిపింది. తెలంగాణ నేత జీ నిరంజన్ పిటిషన్పై విచారణ సందర్భంగా ఈసీ ఈ వివరణ ఇచ్చింది.