న్యూఢిల్లీ, మే 23: ఆధార్లోని డెమొగ్రాఫిక్ (పుట్టినతేదీ, చిరునామా, పేరులో మార్పులు) వివరాల్ని ఆన్లైన్ ద్వారా ఉచితంగా మార్చుకునేందుకు ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (ఉడాయ్) జూన్ 14వరకు అవకాశం కల్పిస్తున్నది. ‘మైఆధార్ పోర్టల్’ ద్వారా మాత్రమే ఈ ఉచిత సేవలు వర్తిస్తాయని ఉడాయ్ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. ఆధార్ సేవా కేంద్రాల ద్వారా అప్డేట్, డెమొగ్రాఫిక్ మార్పులు చేస్తే రూ.50 చెల్లించాల్సి వుంటుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది పౌరుల ప్రయోజనార్థం ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ సౌకర్యం అమలుజేస్తున్నట్టు ఉడాయ్ అధికారిక వర్గాలు తెలిపాయి. పేరులో అక్షర దోషాలు, పుట్టిన తేదీ, చిరునామా మార్పులు, లింగం, 10ఏండ్లుగా ఆధార్ అప్డేట్ చేసుకోని వారు ఈ ఉచిత సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని ఉడాయ్ సూచించింది. ఇందుకోసం నిర్దేశిత జాబితాలో (వోటర్, పాన్కార్డ్, పాస్పోర్ట్..మొదలైనవి) సూచించిన గుర్తింపు, చిరునామా పత్రాల్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సివుంటుంది.
10ఏండ్ల క్రితం ఆధార్ పొందినవారు, అటు తర్వాత అప్డేట్ చేసుకోనట్టయితే..ఇప్పుడు అప్డేట్ చేయటం తప్పనిసరి. ఉదాహరణకు చిరునామా అప్డేట్ చేయాలనుకుంటే, మైఆధార్ పోర్టల్కు వెళ్లి..‘అప్డేట్ అడ్రస్’ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. రిజిష్టర్ మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీని అక్కడ ఎంట్రీ చేయాలి. అటు తర్వాత ‘డాక్యుమెంట్ అప్డేట్’పై క్లిక్ చేసి..దాంట్లో మార్పులు ఉంటే స్కాన్ చేసిన ‘అడ్రస్ ప్రూఫ్’ను అప్లోడ్ చేస్తే ప్రక్రియ ముగుస్తుంది. చాలామంది ఆధార్ కార్డ్ వినియోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పేరు, పుట్టిన తేదీ వివరాల్లో పొరపాట్లు వారికి ఒక సమస్యగా మారాయి.