న్యూఢిల్లీ, మార్చి 12: చుట్టూ సాయుధులైన పోలీసులు, అడుగడుగునా సీసీటీవీలు, డ్రోన్లతో నిఘా, పరిమిత సంఖ్యలోనే అతిథులకు ఆహ్వానం, ప్రతి ఒక్కరినీ క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి ప్రవేశం.. ఇవన్నీ ఢిల్లీలో మంగళవారం జరిగిన ఒక పెండ్లిలో చోటుచేసుకున్న దృశ్యాలు. ఇంతకీ పెళ్లవుతున్నది వీఐపీ జంటకు కాదు.
పలు హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, ఆయుధాల కేసుల్లో సంబంధం ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ప్రధాన అనుచరుడైన 40 ఏండ్ల సందీప్కు, అర డజనుకు పైగా కేసులు ఎదుర్కొంటూ బెయిల్పై ఉన్న 39 ఏండ్ల అనురాధ అలియాస్ మేడమ్ మింజ్ ప్రేమ వివాహానికి పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
పెండ్లికుమారుడు సందీప్ నేరుగా జైలు నుంచి పోలీస్ వ్యాన్లో రాగా, పెండ్లి కుమార్తె స్వయంగా స్కార్పియో డ్రైవ్ చేసుకుంటూ పెండ్లి మండపానికి చేరుకుంది. పెండ్లి నిమిత్తం ఆరు గంటల పెరోల్కు మాత్రమే కోర్టు అనుమతి ఇవ్వడంతో నేరుగా ఖైదీ డ్రెస్లో వచ్చిన గ్యాంగ్స్టర్ సందీప్ తర్వాత మండపంలో డ్రెస్ మార్చుకున్నాడు. 50 మంది అతిథులకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. పెండ్లి అయిన తర్వాత సందీప్ 3.50 గంటలకు అదే పోలీస్ వ్యాన్లో తీహార్ జైలుకు వెళ్లాడు.