ముంబై : పిల్లల భవిష్యత్ బాగుండేందుకు తల్లితండ్రులు ఎన్నో త్యాగలకు, కష్టనష్టాలకు గురవుతూ సంతానాన్ని పెంచి పెద్దచేస్తుంటారు. వారు తమ జీవితంలో పొందలేనివన్నీ పిల్లలకు సమకూర్చాలని ఆరాటపడుతుంటారు. అందుకే తల్లితండ్రులను సంతోషంగా ఉంచి వారు పరిపూర్ణ జీవితం గడిపేలా చూడటం పిల్లల బాధ్యత. ఇక ముంబైలోని మిరా రోడ్డులో దృష్టిలోపంతో బాధపడే తల్లితండ్రులను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్న చిన్నారి బాలిక వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియో కంటెంట్ క్రియేటర్ మిత్ ఇందల్కర్ ఈ వీడియోను షేర్ చేయగా ఇప్పటివరకూ 35 లక్షల మందికి పైగా వీక్షించారు. వైరల్ క్లిప్లో స్కూల్ యూనిఫాం ధరించిన బాలిక దృష్టి లోపంతో బాధపడుతున్న తల్లితండ్రులతో కూర్చుని వారికి సపర్యలు చేస్తుండటం కనిపిస్తుంది. రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్లో కూర్చున్న వారు స్నాక్స్ తీసుకుంటూ కనిపించారు. స్నాక్స్ తీసుకున్న తర్వాత బాలిక తల్లితండ్రులకు క్లీనింగ్ చేయడంలో సహకరించడంతో పాటు వారిని స్టాల్ బయటకు తీసుకువెళుతుండటం వీడియోలో గమనించవచ్చు.
వీరిని తొలిసారి చూసినప్పుడు తాను ఉద్వేగానికి గురయ్యానని, వీరు రోజూ ఈ షాపుకు వస్తుంటారని, ఆమె తల్లితండ్రులు అంధులే అయినా వారు తమ కూతురి కళ్లతో ప్రపంచాన్ని చూస్తున్నారని ఇందల్కర్ ఈ వీడియోను షేర్ చేస్తూ రాసుకొచ్చారు. తల్లితండ్రుల కంటే మిమ్మల్ని ఎవరూ ఎక్కువగా చూసుకోరని, వారు మిమ్నల్ని వీడి వెళ్లేలోగా వారిని జాగ్రత్తగా చూసుకోండని రాసుకొచ్చారు. బాలిక తన వయసులో ఉన్నవారెవరూ చేయని విధంగా తల్లితండ్రుల పట్ల కేర్ తీసుకుంటోందని ఓ యూజర్ ప్రశంసించారు. ఆ కుటుంబానికి అవసరమైన సాయం చేసి ఆసరాగా ఉంటామని మరికొందరు యూజర్లు రాసుకొచ్చారు.