అది అర్ధరాత్రి 1.30 సమయం. బస్సులోని ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇంతలో భారీ కుదుపు. బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. దీంతో ఒక్కసారిగా మెలుకువ వచ్చిన ప్రయాణికులకు ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే చుట్టూ భారీ ఎత్తున మంటలు అలముకొన్నాయి. కిటికీలు బద్దలుకొట్టి, ఆ అగ్నికీలల నుంచి బయటపడేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. 25 మంది ప్రయాణికులు ఆ మంటల్లోనే ఆహుతయ్యారు. మహారాష్ట్రలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మహా విషాదమిది.
నాగ్పుర్, జూలై 1: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొన్నది. బుల్దానా జిల్లాలోని సమృద్ధి ఎక్స్ప్రెస్వేపై ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి రహదారి పక్కన స్తంభంతో పాటు డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది. అనంతరం డీజిల్ ట్యాంకు పేలి, క్షణాల వ్యవధిలోనే భారీయెత్తున మంటలు చెలరేగడంతో 25 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటన శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో నాగ్పూర్కు 130 కిలోమీటర్ల దూరంలోని పింపల్ఖుటా గ్రామం వద్ద చోటుచేసుకొన్నది. ప్రమాద సమయంలో బస్సు నాగ్పుర్ నుంచి పుణె వెళ్తున్నది. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నది. ఈ దుర్ఘటనలో బస్సు డ్రైవర్, క్లీనర్ సహా ఎనిమిది మంది ప్రయాణికులు బస్సు కిటికీలు బద్దలు కొట్టుకొని, క్షేమంగా బయటకు రాగలిగారు. ప్రమాద సమయంలో బస్సులో 33 మంది ఉన్నారని బుల్దానా ఎస్పీ సునీల్ తెలిపారు.
మంటల్లో చిక్కుకొన్న ప్రయాణికుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఘటనను గమనించిన పలువురు స్థానికులు వెంటనే స్పందించినప్పటికీ, బస్సు దట్టమైన మంటల్లో ఉండటంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొన్నది. బస్సులోపల ఉన్నవారు కిటికీలు పగులకొట్టి, బయటకు వచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. సాయం కోసం అర్థిస్తూనే తమ కండ్ల ముందే ప్రయాణికులు సజీవంగా దహనమయ్యారని స్థానికుడు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. అటుగా వెళ్తున్న వాహనదారులు ప్రమాదాన్ని చూసినా, స్పందించలేదని, లేకుంటే కొంత మందినైనా కాపాడే వాళ్లమని పేర్కొన్నారు.
ప్రమాద తీవ్రతతో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో మృతదేహాలను సంబంధింత బంధువులకు అప్పగించే ముందు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ప్రమాదంపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే దర్యాప్తునకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ విషాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీతో పాటు పలువురు సీఎంలు, నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కాగా, ప్రమాదానికి కారణంపై డ్రైవర్, పొలీసుల వాదనలు భిన్నంగా ఉన్నాయి. బస్సు టైర్ పేలడంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిందని డ్రైవర్ చెబుతున్నాడు. అయితే ఈ దుర్ఘటనలో మానవ తప్పిదం ఉన్నదని పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రైవింగ్ సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడని, దీంతో బస్సు అదుపు తప్పి, డివైడర్ను ఢీకొట్టి ఉండొచ్చని హైవే పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి టైర్ పేలడం కారణం కాదని, ఘటనాస్థలిలో చిన్న టైర్ రబ్బర్ ముక్క కూడా దొరకలేదని అమరావతి ప్రాంతీయ రవాణా కార్యాలయం నివేదికలో పేర్కొన్నది.
నాగ్పుర్-ముంబై సమృద్ధి ఎక్స్ప్రెస్వేను గత ఏడాది డిసెంబర్ 11న ప్రారంభించారు. అప్పటి నుంచి తాజా ప్రమాదం వరకు దాదాపు ఆరు నెలలకు పైగా వ్యవధిలో 616 చిన్న, పెద్ద ప్రమాదాలు చోటుచేసుకొన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 39 ఘోర ప్రమాదాలు జరిగాయని, 88 మంది మరణించారని ఓ అధికారి తెలిపారు. మొత్తంగా 656 మందికి స్వల్ప, తీవ్ర గాయాలయ్యాయని వెల్లడించారు. వీటిల్లో దాదాపు 100కు పైగా ప్రమాదాలకు ‘హైవే హిప్నోసిస్’ ప్రధాన కారణమని మహారాష్ట్ర హైవే పోలీసులు పేర్కొంటున్నారు.
హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర బస్సు ప్రమాదం పట్ల బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
సమృద్ధి ఎక్స్ప్రెస్వేపై ప్రమాదాల్లో చాలా వరకు మానవతప్పిదాల కారణంగానే జరిగాయని సీఎం ఏక్నాథ్ షిండే పేర్కొనడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందించాయి. ప్రమాదాల్లో ఇప్పటికే చాలా మంది మరణించారని, ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరువాలని శివసేన(యూటీబీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే హితవు పలికారు. ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఎక్స్ప్రెస్వే నిర్మాణం శాస్త్రీయంగా జరుగలేదని, అందుకే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. రోడ్డు నాణ్యతపై నిందించడం సరికాదని డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ప్రతిపక్షాల విమర్శలకు స్పందనగా చెప్పుకొచ్చారు.